Skip to content

లూకా22

యేసును చంపే కుట్ర మరియు యూదా ద్రోహం

1
పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు,
2
ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును ఎలా చంపించాలా అని అవకాశం కోసం చూస్తున్నారు, ఎందుకంటే వారు ప్రజలకు భయపడ్డారు.
3
అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
4
కాబట్టి వాడు ముఖ్య యాజకులతో దేవాలయ కావలివారి అధికారులతో కలిసి యేసును వారికి ఎలా అప్పగించబోతున్నాడో వారితో చర్చించుకున్నాడు.
5
వారు వాని మాటలకు సంతోషించి వానికి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
6
వాడు దానికి అంగీకరించి, ప్రజల గుంపు ఆయనతో లేనప్పుడు యేసును వారికి అప్పగించడానికి అవకాశం కోసం ఎదురుచూశాడు.

పస్కా సిద్ధపాట్లు

7
పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు,
8
యేసు పేతురు యోహానును పిలిచి, “మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి” అని పంపారు.
9
కాబట్టి వారు, “మేము ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని అడిగారు.
10
అందుకు ఆయన, “మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, అతడు ప్రవేశించే ఇంటి వరకు అతన్ని వెంబడించి,
11
ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి.
12
అతడు అన్ని సదుపాయాలతో ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
13
వారు అక్కడికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొని పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.

చివరి విందు

14
వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు.
15
ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను.
16
ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు.
17
ఆయన గిన్నెను తీసుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి.
18
దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు.
19
ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కోసం ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.
20
అలాగే, భోజనమైన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందించనున్న నా రక్తంలో క్రొత్త నిబంధన.
21
కాని నన్ను అప్పగించబోయే వాని చేయి నాతోకూడ ఈ బల్ల మీద ఉంది.
22
నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు.
23
అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.

గొప్పతనం గురించి వివాదం

24
అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది.
25
యేసు వారితో, “యూదేతరుల రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చేసేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు.
26
కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి దాసునిగా ఉండాలి.
27
అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేదా సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్నవాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.
28
మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు.
29
కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను.

పేతురు నిరాకరణను యేసు ముందుగా తెలియజేయుట

31
“సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.
32
కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీకోసం ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పారు.
33
కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.
34
అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు.
35
ఇంకా ఆయన, “మీకు డబ్బు సంచి, సంచి, చెప్పులు లేకుండ నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా?” అని వారిని అడిగారు. దానికి వారు, “ఏమి తక్కువ కాలేదు” అన్నారు.

రాబోయే సంఘర్షణకు సిద్ధత

36
అందుకు ఆయన వారితో, “అయితే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బు సంచి ఉంటే, దాన్ని తీసుకెళ్లాలి. ఒకవేళ మీ దగ్గర ఖడ్గం లేకపోతే, మీ పైవస్త్రాన్ని అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోవాలి.
37
‘ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది; నా విషయంలో ఇది నెరవేర్చబడాలి. అవును, నా గురించి వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి” అని అన్నారు.
38
శిష్యులు, “ఇదిగో ప్రభువా, ఇక్కడ రెండు ఖడ్గాలు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో, “అవి చాలు!” అని జవాబిచ్చారు.

ఒలీవల కొండపై యేసు ప్రార్థన

39
భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, “మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి” అని చెప్పారు.
41
అలా చెప్పి వారి నుండి ఒక రాయి విసిరేంత దూరం వెళ్లి, మోకరించి ఇలా ప్రార్థించారు:
42
“తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చేయి.”
43
అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు.
44
ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.
45
ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూశారు
46
ఆయన వారితో, “మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడిపోకుండా లేచి ప్రార్థన చేయండి” అని చెప్పారు.

యేసును అరెస్టు చేయుట

47
ఆయన ఇంకా మాట్లాడుతుండగా, ప్రజలు గుంపుగా వచ్చారు, పన్నెండుగురిలో ఒకడైన యూదా అని పిలువబడే వాడు ముందుండి వారిని నడిపించాడు. వాడు యేసుని ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు.
48
అయితే యేసు వానితో, “యూదా, నీవు ముద్దుతో మనుష్యకుమారుని అప్పగిస్తున్నావా?” అని చెప్పారు.
49
యేసుతో ఉన్నవారు జరుగబోయేది గ్రహించి, “ప్రభువా, వారిని ఖడ్గంతో నరకమంటావా?” అని ఆయనను అడిగారు.
50
అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని కుడి చెవిని నరికాడు.
51
అయితే యేసు, “అంతటితో ఆపండి!” అని చెప్పి, వాని చెవిని ముట్టి స్వస్థపరిచారు.
52
యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ముఖ్య యాజకులతో, దేవాలయ కావలివారి అధికారులతో యూదా నాయకులతో, “నన్ను పట్టుకోవడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా?
53
నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు నాపై ఒక చేయి కూడ వేయలేదు. అయినా ఇప్పుడు ఇది మీ సమయం, చీకటి పరిపాలిస్తున్న సమయం” అన్నారు.

పేతురు యేసును నిరాకరించుట

54
వారు యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు పేతురు దూరం నుండి వారిని వెంబడించాడు.
55
అక్కడ కొందరు ప్రాంగణం మధ్యలో మంటలు వేసి, కలిసి కూర్చున్నప్పుడు, పేతురు వారితో కూర్చున్నాడు.
56
అప్పుడు ఆ మంట వెలుతురులో ఒక దాసియైన అమ్మాయి అతన్ని తేరి చూసి, “ఇతడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నది.
57
పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
58
కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, “నీవు కూడా వారిలో ఒకడివి” అన్నాడు. పేతురు, “నేను కాదు!” అన్నాడు.
59
ఇంచుమించు ఒక గంట సమయం తర్వాత మరొకడు, “వీడు గలిలయుడే, నిజంగానే వీడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నాడు.
60
అందుకు పేతురు, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్తుండగానే కోడి కూసింది.
61
అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు అప్పుడు పేతురు, “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని,
62
బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.

యేసును ఎగతాళి చేసి విచారించుట

63
యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.
64
వారు ఆయన ముఖాన్ని కప్పి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు.
65
ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు.
66
ఉదయం కాగానే ప్రజానాయకుల సభ, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమావేశమయ్యారు, యేసు వారి ముందు నడిపించబడ్డారు.
67
“నీవు క్రీస్తువైతే, మాతో చెప్పు” అన్నారు. అందుకు యేసు, “నేను మీతో చెప్పినా, మీరు నమ్మరు.
68
ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా, మీరు నాకు జవాబు చెప్పరు.
69
కానీ ఇప్పటినుండి మనుష్యకుమారుడు శక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుంటాడు” అని వారితో చెప్పారు.
70
అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు. అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు.
71
అందుకు వారు, “మనకు ఇంకా సాక్ష్యం ఏం అవసరం? స్వయంగా ఇతడే తన నోటితో పలకడం విన్నాం” అన్నారు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options