కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు

759 వచనాలు · 177 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోషే యెహోవాతో అన్నాడు,

  2. “సమస్త జీవులకు శ్వాసనిచ్చే దేవుడైన యెహోవా, ఈ సమాజం మీద ఒక నాయకుని నియమించాలి,

  3. అతడు ఈ సమాజం ముందు వెళ్తూ, వస్తూ, వారిని బయటకు లోనికి నడిపిస్తూ ఉండాలి, అప్పుడు యెహోవా ప్రజలైన వీరు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”

  4. కాబట్టి యెహోవా మోషేతో అన్నారు, “నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వపు ఆత్మ ఉంది, అతని మీద నీ చేయి పెట్టు.

  5. యాజకుడైన ఎలియాజరు సమాజమందరి సముఖంలో అతన్ని నిలబెట్టి, అధికార పూర్వకంగా నియమించు.

  6. నీ ప్రభావంలో కొంత అతనికి ఇవ్వు, అప్పుడు ఇశ్రాయేలు సమాజమంతా అతనికి లోబడుతుంది.

  7. అతన్ని యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబెట్టు, ఎలియాజరు యెహోవా సన్నిధిలో ఊరీముతో సంప్రదించి అతని కోసం చట్టాలు పొందుకోవాలి. అతని ఆజ్ఞమేరకు అతడు, ఇశ్రాయేలు సమాజమంతా బయటకు వెళ్తుంది, అతని ఆజ్ఞమేరకు వారు లోనికి వస్తారు.”

  8. యెహోవా ఆజ్ఞమేరకు మోషే చేశాడు. యెహోషువను యాజకుడైన ఎలియాజరు ముందు, సర్వసమాజం ముందు నిలబెట్టాడు.

  9. తర్వాత యెహోవా మోషేకు సూచించిన ప్రకారం అతనిపై చేతులుంచి అధికార పూర్వకంగా అతన్ని నియమించాడు.

  10. యెహోవా మోషేతో మాట్లాడుతూ,

  11. “ఇశ్రాయేలీయుల కోసం మిద్యానీయుల మీద నీవు ప్రతీకారం తీర్చుకో. ఆ తర్వాత నీవు నీ స్వజనుల దగ్గరకు చేరతావు.”

  12. కాబట్టి మోషే ప్రజలతో, “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి వెళ్లి యెహోవా వారి మీద తీర్చుకోవాలనుకున్న ప్రతీకారాన్ని తీర్చుకోండి.

  13. ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం నుండి వేయిమంది పురుషులను యుద్ధానికి పంపండి” అని చెప్పాడు.

  14. కాబట్టి ఇశ్రాయేలు వంశాల నుండి పన్నెండువేలమంది పురుషులు ఆయుధాలతో యుద్ధం కోసం సిద్ధపడ్డారు.

  15. మోషే వారిని యుద్ధానికి పంపాడు, ప్రతి గోత్రం నుండి వేయిమందిని పంపాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, తనతో పాటు పరిశుద్ధాలయం నుండి పరికరాలు సంకేతం ఇవ్వడానికి బూరలు తీసుకున్నాడు.

  16. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మిద్యానుతో వారు పోరాడారు, ప్రతి మగవాన్ని హతం చేశారు.

  17. చచ్చినవారిలో అయిదుగురు మిద్యాను రాజులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ. వారు బెయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు.

  18. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను, పిల్లలను బందీగా తీసుకుని వారి పశువులను, మందలను, వారి ఆస్తిని దోచుకున్నారు.

  19. వారు మిద్యానీయులు నివసించే పట్టణాలన్ని, వారి శిబిరాలతో, తగలబెట్టారు.

  20. వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా,

  21. బందీలను, కొల్లగొట్టిన వాటిని, దోపుడుసొమ్మును తీసుకువచ్చారు యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో ఉన్న మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలు సమాజం దగ్గరకు తీసుకువచ్చారు.

  22. మోషే, యాజకుడైన ఎలియాజరు సమాజ నాయకులు వారిని కలుసుకోడానికి శిబిరం బయటకు వచ్చారు.

  23. మోషే సైన్య అధికారులు అనగా, యుద్ధం నుండి తిరిగివచ్చిన సహస్రాధిపతులు శతాధిపతులపై కోప్పడ్డాడు.

  24. “స్త్రీలందరిని మీరు బ్రతకనిచ్చారా?” అని మోషే వారిని అడిగాడు.

  25. “వీరు బిలాము సలహా ప్రకారం పెయోరు సంఘటనలో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉండడానికి పురికొల్పినవారు, వీరి మూలంగా యెహోవా ప్రజలు తెగులు ద్వారా మొత్తబడ్డారు.