Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
యెహోవా మోషేతో అన్నారు,
“పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.
పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి.
చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది.
ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.”
వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.
ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము;
అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.
అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.
అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)
లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.
యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు.
వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.
ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.
యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి
సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి,
“మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు.
కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు.
మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు,
యెహోవా మోషేతో అన్నారు,
సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి.
“ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి.
ఒకవేళ అతనికి కుమార్తెలు లేకపోతే, అతని వారసత్వం అతని సహోదరులకు ఇవ్వాలి.
ఒకవేళ సహోదరులు లేకపోతే, వారసత్వం అతని తండ్రి సహోదరులకు ఇవ్వాలి.
అతని తండ్రికి సహోదరులు లేకపోతే, తన వారసత్వం సమీప బంధువుకు ఇవ్వాలి, అతడు స్వాస్థ్యంగా పొందుకుంటాడు. ఇది ఇశ్రాయేలీయుల కోసం యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన న్యాయ నియమము.’ ”