The Tribe Of Reuben గురించి బైబిల్ వచనాలు: Obtained inheritance east of Jordan on condition of helping to conquer Canaan
Obtained inheritance east of Jordan on condition of helping to conquer Canaan గురించి వచనాలు
చాలా ఎక్కువ పశువుల మందలు కలిగిన రూబేనీయులు, గాదీయులు తమ పశువులకు యాజెరు, గిలాదు ప్రాంతాలు తగిన స్థలాలని చూశారు.
కాబట్టి వారు మోషే, యాజకుడైన ఎలియాజరు, సమాజ నాయకుల దగ్గరకు వచ్చి,
“అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎల్యాలెహు, షెబాము, నెబో, బెయోను ప్రాంతాలు,
ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి.
మీరు మా పట్ల దయ చూపిస్తే ఈ స్థలం మీ సేవకులమైన మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి. మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకండి” అని అన్నారు.
మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు.
“యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు?
మీ తండ్రులను కాదేషు బర్నియాకు స్థలాన్ని చూసి రమ్మని పంపితే వారు ఇలాగే చేశారు.
వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి తిరిగివచ్చి, యెహోవా వారికిచ్చిన వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నిరాశ పరిచారు.
ఆ రోజు యెహోవా కోపం వారిపై రగులుకొని, ఆయన ఇలా ప్రమాణం చేశారు:
‘వారు హృదయమంతటితో నన్ను వెంబడించలేదు కాబట్టి, ఈజిప్టు నుండి వచ్చిన వారిలో ఇరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు ఉన్నవారు ఎవ్వరూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఈ దేశాన్ని చూడరు.
కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వెళ్తారు, ఎందుకంటే వీరు యెహోవాను హృదయమంతటితో వెంబడించారు.’
యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. ఆయన వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగేలా చేశారు, ఆయన దృష్టి నుండి చెడు చేసిన వారందరు చనిపోయే వరకు అలా చేశారు.
“ఇక్కడ మీరు, పాపుల సంతానం, మీ తండ్రుల స్థానంలో నిలబడి, యెహోవాకు ఇశ్రాయేలుపై మరింత కోపం తెప్పిస్తున్నారు.
మీరు ఆయనను వెంబడించకుండా తప్పుకుంటే, ఆయన మరలా ప్రజలందరినీ అరణ్యంలో వదిలేస్తారు వారి నాశనానికి మీరే కారణం అవుతారు.”
వారు అతని దగ్గరకు వచ్చి, “మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు మా స్త్రీలు, పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము.
కానీ మేము యుద్ధానికి మమ్మల్ని మేము సిద్ధంగా ఉంచుకుని ఇశ్రాయేలీయులకు ముందుగా వెళ్తూ వారు వారి స్థలాలకు చేరేవరకు ఉంటాము. ఆ సమయంలో మా స్త్రీలు, పిల్లలు కోటగోడలు గల పట్టణాల్లో ఉంటూ, ప్రాంత నివాసులకు కాపుదలగా ఉంటారు.
ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు తమ వారసత్వం స్వాధీనం చేసుకునేవరకు మా గృహాలకు వెళ్లము.
యొర్దానుకు అవతల వారసత్వం పొందుకోము ఎందుకంటే మా వారసత్వం యొర్దాను తూర్పు ప్రదేశంలో ఉంది.”
అప్పుడు మోషే వారితో, “మీరు ఇలా చేస్తే అంటే మీరు యుద్ధం కోసం యెహోవా ఎదుట సిద్ధంగా ఉంటే,
ఆయుధాలు ధరించిన మీరందరూ యొర్దాను దాటి యెహోవా తన శత్రువులను తన ఎదుట నుండి తరిమికొట్టే వరకు యొర్దానును దాటితే,
దేశం యెహోవా ఎదుట వశపరచబడినప్పుడు, మీరు తిరిగివచ్చి యెహోవాకు, ఇశ్రాయేలుకు మీ బాధ్యత నుండి విముక్తి పొందవచ్చు. ఈ దేశం యెహోవా ఎదుట మీకు స్వాస్థ్యంగా ఉంటుంది.
“కానీ మీరు ఇలా చేయకపోతే, యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు; మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు.
ఇప్పుడు మీ స్త్రీల కోసం, పిల్లల కోసం పట్టణాలు, మీ మందల దొడ్లు నిర్మించుకోండి, కానీ మీరు చెప్పినదంతా చేయండి.”
గాదీయులు, రూబేనీయులు మోషేతో ఇలా అన్నారు, “మీ సేవకులైన మేము మా ప్రభువా ఆజ్ఞాపించినట్లే చేస్తాము.