Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. అతడు తన సైన్యమంతటిని పోగు చేసి, ఇశ్రాయేలుపై దాడి చేయడానికి అరణ్యంలోకి వెళ్లాడు. అతడు యాహాజుకు చేరినప్పుడు, ఇశ్రాయేలుతో పోరాడాడు.
అయితే ఇశ్రాయేలు అతన్ని ఖడ్గంతో చంపి అతని దేశాన్ని అర్నోను నది నుండి యబ్బోకు వరకు ఆక్రమించారు, కానీ అమ్మోనీయుల సరిహద్దు వరకు మాత్రమే ఎందుకంటే వారి సరిహద్దు పటిష్టమైనది.
ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణాలన్నిటిని, హెష్బోను దాని చుట్టూరా ఉన్న గ్రామాలతో సహా స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.
హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. సీహోను అంతకుముందు మోయాబు రాజుతో యుద్ధం చేసి, అర్నోను నది వరకు ఉన్న ప్రదేశమంతా వశం చేసుకున్నాడు.
అందుకే సామెతలు చెప్పేవారు ఇలా అంటారు: హెష్బోనుకు రండి అది తిరిగి కట్టబడనివ్వండి; సీహోను పట్టణం పూర్వస్థితికి వచ్చును గాక.
హెష్బోను నుండి అగ్ని బయలుదేరింది, సీహోను పట్టణం నుండి మంటలు వచ్చాయి. అది మోయాబులోని ఆరు పట్టణాన్ని కాల్చివేసింది. అర్నోను యొక్క ఎత్తైన స్థలాల యజమానులను దహించివేసింది.
మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలారా! మీరు నాశనమయ్యారు. అతడు తన కుమారులను పారిపోయేవారిగా, అతని కుమార్తెలను అమోరీయుల రాజైన సీహోను దగ్గర చెరగా అప్పగించాడు.
“అయితే మేము వారిని కూల్చివేసాము; హెష్బోను అధికారం దీబోను వరకు నాశనమైంది. నోఫహు వరకు వారిని పడగొట్టాము, మెదెబా వరకు అది వ్యాపించింది.”
కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.
యాజెరు ప్రాంతాన్ని చూసి రమ్మని మోషే వేగులవారిని పంపిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకుని అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు.
తర్వాత వారు తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము, అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో వారిని ఎదుర్కోడానికి బయలుదేరాడు.
యెహోవా మోషేతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని ఆజ్ఞాపించారు.
కాబట్టి వారు ఓగును, అతని కుమారులను, అతని సైన్యమంతటిని, ఏ ఒక్కరు మిగలకుండా హతం చేశారు. అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ రాత్రి దేవుడు వచ్చి బిలామును, “నీతో ఉన్న వీళ్ళు ఎవరు?” అని ప్రశ్నించారు.
బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు:
‘ఈజిప్టు నుండి వచ్చిన ఒక ప్రజల గుంపు భూమినంతా కప్పుతుంది. నా కోసం వారిని శపించు. బహుశ అప్పుడు నేను వారితో యుద్ధం చేసి తరిమివేస్తాను.’ ”
అయితే దేవుడు బిలాముతో, “నీవు వారితో వెళ్లొద్దు. వారు దీవించబడినవారు కాబట్టి నీవు వారిని శపించకూడదు” అని అన్నారు.
మర్నాడు ఉదయం బిలాము బాలాకు అధికారులతో, “మీ సొంత దేశానికి వెళ్లిపొండి, నేను మీతో వెళ్లడానికి యెహోవా నిరాకరించారు” అని చెప్పాడు.
కాబట్టి మోయాబు అధికారులు బాలాకు దగ్గరకు తిరిగివెళ్లి, “బిలాము మాతో రావడానికి ఒప్పుకోలేదు” అని చెప్పారు.
అప్పుడు బాలాకు ఇతర అధికారులను, మొదటిసారి కన్నా ఇంకా ఎక్కువ మంది ప్రముఖులను, పంపాడు.
వారు బిలాము దగ్గరకు వచ్చి అన్నారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా చెప్తున్నాడు: నా దగ్గరకు రాకుండ ఏది కూడా మిమ్మల్ని ఆపనివ్వకండి,
ఎందుకంటే నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను, నీవు నాకు ఏది చెబితే అది చేస్తాను. వచ్చి నా కోసం ఈ ప్రజలపై శాపం పెట్టండి.”
అయితే బిలాము వారితో, “బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారమంతా ఇచ్చినా సరే, నా దేవుడైన యెహోవా ఆజ్ఞకు మించి ఎక్కువ గాని తక్కువ గాని చేయలేను.
మీరు రాత్రి ఇక్కడ గడపండి, యెహోవా నాకేమి చెప్తారు తెలుసుకుంటాను” అని చెప్పాడు.
ఆ రాత్రి దేవుడు బిలాముతో, “ఈ మనుష్యులు నిన్ను పిలువడానికి వచ్చారు కాబట్టి నీవు వారితో వెళ్లు కానీ నేను చెప్పేది మాత్రమే చేయు” అని అన్నారు.