కంటెంట్‌కు వెళ్లండి

Ark of the Covenant గురించి బైబిల్ వచనాలు

88 వచనాలు · 37 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.

  2. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు దానిని ఎబెనెజెరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.

  3. వారు దేవుని మందసాన్ని దాగోను గుడిలోనికి తీసుకువచ్చి దానిని దాగోను ప్రక్కన ఉంచారు.

  4. అయితే మరుసటిరోజు ప్రొద్దుటే అష్డోదు ప్రజలు లేచి చూడగా, యెహోవా మందసం ఎదుట దాగోను నేలపై బోర్లా పడి ఉంది. కాబట్టి వారు దాగోనును లేపి తిరిగి దాని స్థానంలో నిలబెట్టారు.

  5. ఆ మరుసటి ఉదయం అష్డోదు ప్రజలు లేచి చూడగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలపై బోర్లా పడి ఉంది. దాగోను తల రెండు చేతులు నరికివేయబడి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలి ఉంది.

  6. యెహోవా హస్తం అష్డోదు ప్రజల మీద దాని చుట్టుప్రక్కల ప్రాంతాల మీద భారంగా ఉంది; ఆయన వారి పైకి వినాశనం తెచ్చి గడ్డలతో వారిని బాధించారు.

  7. అష్డోదు ప్రజలు జరిగిన దానిని చూసి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండకూడదు, ఎందుకంటే దానిని బట్టి ఆయన హస్తం మనమీద, మన దేవుడైన దాగోను మీద భారంగా ఉంది” అన్నారు.

  8. కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని వారిని అడిగారు. అందుకు వారు, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడినుండి తీసుకెళ్లారు.

  9. కానీ వారు దానిని తరలించిన తర్వాత, యెహోవా హస్తం ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉండి, వారిని చాలా భయాందోళనలకు గురిచేసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పట్టణంలోని ప్రజలకు ఆయన గడ్డలు పుట్టించి బాధించారు.

  10. కాబట్టి వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపించారు. దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోను ప్రజలు, “మనలను మన ప్రజలను నాశనం చేయడానికి వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు.

  11. కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి పంపివేయండి; దాని చోటికి దానిని పంపివేయండి” అన్నారు. ఎందుకంటే, ఆ పట్టణమంతా భయంతో నిండిపోయింది; దేవుని హస్తం దానిపైన చాలా భారంగా ఉంది.

  12. చనిపోకుండా ఉన్నవారు గడ్డల చేత బాధించబడ్డారు. ఆ పట్టణ ప్రజల కేకలు ఆకాశం వరకు వినబడ్డాయి.

  13. యెహోవా మందసం ఏడు నెలలు ఫిలిష్తీయుల స్థావరంలో ఉన్న తర్వాత,

  14. ఫిలిష్తీయులు యాజకులను, సోదె చెప్పేవారిని పిలిపించి, “మనం యెహోవా మందసం గురించి ఏం చేద్దాం? దాని చోటికి తిరిగి దానిని ఎలా పంపించాలో మాకు చెప్పండి?” అని అడిగారు.

  15. అందుకు వారు, “మీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటే, బహుమతి లేకుండా ఆయనకు తిరిగి పంపవద్దు; ఆయనకు అపరాధపరిహార అర్పణ పంపాలి. అప్పుడు మీరు స్వస్థత పొందుతారు, ఆయన చేయి మీమీద నుండి ఎందుకు తీసివేయబడలేదో మీకు తెలుస్తుంది” అన్నారు.

  16. అప్పుడు ఫిలిష్తీయులు, “మనం ఆయనకు అపరాధ పరిహారార్పణగా ఏమి పంపుదాం?” అని అడిగారు. అందుకు వారు అన్నారు, “మీరు, మీ నాయకులందరు ఒకే రకమైన తెగులుతో బాధించబడ్డారు కాబట్టి, ఫిలిష్తీయుల పాలకుల లెక్క ప్రకారం అయిదు బంగారపు గడ్డల రూపాలు, అయిదు బంగారపు ఎలుకల రూపాలు అర్పించాలి.

  17. మీకు వచ్చిన గడ్డలకు దేశాన్ని పాడు చేస్తున్న ఎలుకలకు సూచనగా ఈ గడ్డలు, ఎలుకల రూపాలు తయారుచేసి పంపించి ఇశ్రాయేలు దేవున్ని మహిమపరచాలి. అప్పుడు మీమీద నుండి, మీ దేవుళ్ళ మీద నుండి, మీ దేశం మీద నుండి ఆయన తన హస్తాన్ని తీసివేయవచ్చు.

  18. ఈజిప్టువారు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకున్నట్లు మీరెందుకు కఠినం చేసుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల దేవుడు వారితో కఠినంగా వ్యహరించినప్పుడు, వారు ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చారు; అప్పుడు ఇశ్రాయేలీయులు తమ దారిని తాము వెళ్లిపోలేదా?

  19. “కాబట్టి, మీరు క్రొత్త బండి ఒకటి తయారుచేయించి, ఇంతవరకు కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి బండికి కట్టాలి. కాని వాటి దూడలను వాటి దగ్గర నుండి దొడ్డికి తోలివేయాలి.

  20. యెహోవా మందసాన్ని బండిపైన ఉంచి, దాని ప్రక్కన అపరాధ పరిహారార్థబలిగా మీరు పంపుతున్న బంగారు వస్తువులు ఉన్న పెట్టెను పెట్టండి. దాని మార్గాన దాన్ని పంపండి,

  21. కాని దానిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. అది తన సొంత ప్రాంతమైన బేత్-షెమెషు వైపుకు వెళ్తే యెహోవా మన మీదికి ఈ గొప్ప విపత్తు తెచ్చారని, అలా జరుగకపోతే మన మీదికి వచ్చిన విపత్తు ఆయన హస్తం వలన కాదని ఇది అనుకోకుండ మనకు జరిగిందని మనకు తెలుస్తుంది.”

  22. కాబట్టి వారు అలాగే చేశారు. రెండు పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను దొడ్డికి పంపి,

  23. యెహోవా మందసాన్ని దానితో పాటు బంగారు ఎలుకలు, గడ్డల రూపాలు ఉన్న పెట్టెను వారు బండిపైన పెట్టారు.

  24. అప్పుడు ఆ ఆవులు దారిలో తిన్నగా వెళ్తూ, అరుస్తూ తిన్నగా బేత్-షెమెషు దారిలో నడిచాయి; అవి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఫిలిష్తీయుల పాలకులు బేత్-షెమెషు సరిహద్దు వరకు వాటిని వెంబడిస్తూ వెళ్లారు.

  25. బేత్-షెమెషు ప్రజలు లోయలో తమ గోధుమపంటను కోస్తున్నారు. వారు కళ్ళెత్తి చూసినప్పుడు మందసం కనబడింది, వారు దాన్ని చూసి సంతోషించారు.