కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు 8:16సుమారు క్రీ.పూ. 1245

    ఆ ఊరిపెద్దలను పట్టుకుని ఎడారి ముళ్ళతో, ముళ్ళపొదలతో శిక్షించి సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు.

  2. న్యాయాధిపతులు 8:17సుమారు క్రీ.పూ. 1245

    అతడు పెనూయేలు గోపురాన్ని కూడా పడగొట్టి ఆ పట్టణస్థులను చంపాడు.

  3. న్యాయాధిపతులు 8:18సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను, “మీరు తాబోరులో ఎలాంటి మనుష్యులను చంపారు?” అని జెబహును సల్మున్నాను అడిగాడు. అందుకు వారు, “నీలాంటి వారినే, వారంతా రాజకుమారుల్లా ఉన్నారు” అన్నారు.

  4. న్యాయాధిపతులు 8:19సుమారు క్రీ.పూ. 1245

    అందుకు గిద్యోను, “వారు నా సోదరులు, నా సొంత తల్లి కుమారులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని చంపేవాడిని కాదు” అన్నాడు.

  5. న్యాయాధిపతులు 8:20సుమారు క్రీ.పూ. 1245

    అతడు తన పెద్దకుమారుడైన యెతెరును చూసి, “వారిని చంపు!” అన్నాడు కాని యెతెరు చిన్నవాడు కాబట్టి భయపడి తన ఖడ్గాన్ని దూయలేదు.

  6. న్యాయాధిపతులు 8:21సుమారు క్రీ.పూ. 1245

    అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే చేయు, మనిషిని బట్టి అతని శక్తి ఉంటుంది” అన్నారు. గిద్యోను ముందుకు వెళ్లి వారిని చంపి, వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.

  7. న్యాయాధిపతులు 8:22సుమారు క్రీ.పూ. 1245

    అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, “నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి మమ్మల్ని నీవు, నీ కుమారుడు, నీ మనుమడు పాలించండి” అన్నారు.

  8. న్యాయాధిపతులు 8:23సుమారు క్రీ.పూ. 1245

    అయితే గిద్యోను వారితో, “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించడు. యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తారు” అన్నాడు.

  9. న్యాయాధిపతులు 8:24సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను ఇంకా మాట్లాడుతూ, “నేను చేసే మనవి ఒక్కటే, మీలో ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న ఒక చెవి పోగును నాకు ఇవ్వండి” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు కాబట్టి వారి ఆచారం చెవులకు పోగులు పెట్టుకోవడము.)

  10. న్యాయాధిపతులు 8:25సుమారు క్రీ.పూ. 1245

    వారు జవాబిస్తూ, “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాం” అన్నారు. కాబట్టి వారు ఒక బట్ట పరచి, ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దానిలో వేశారు.

  11. న్యాయాధిపతులు 8:26సుమారు క్రీ.పూ. 1245

    మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు ఆభరణాలు ఊదా దుస్తులు వారి ఒంటెల మెడలకున్న గొలుసులు కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల షెకెళ్ళ బంగారం అయ్యింది.

  12. న్యాయాధిపతులు 8:27సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను ఆ బంగారాన్ని ఏఫోదులా చేసి దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరు అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారం చేశారు. అది గిద్యోనుకు అతని కుటుంబానికి ఉచ్చుగా మారింది.

  13. న్యాయాధిపతులు 8:28సుమారు క్రీ.పూ. 1245

    మిద్యానీయులను ఇశ్రాయేలీయులు అణచివేసిన తర్వాత వారు మరలా తల ఎత్తలేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

  14. న్యాయాధిపతులు 8:29సుమారు క్రీ.పూ. 1245

    యోవాషు కుమారుడు గిద్యోను తన సొంత ఇంట్లో నివసించడానికి తిరిగి వెళ్లిపోయాడు.

  15. న్యాయాధిపతులు 8:30సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్నారు కాబట్టి అతనికి పుట్టిన కుమారులు డెబ్బైమంది ఉన్నారు.

  16. న్యాయాధిపతులు 8:31సుమారు క్రీ.పూ. 1245

    షెకెములో ఉన్న తన ఉంపుడుగత్తెకు కూడా ఒక కుమారుడు పుట్టినప్పుడు అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.

  17. న్యాయాధిపతులు 8:32సుమారు క్రీ.పూ. 1245

    యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు, అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యోవాషు సమాధిలో అతడు పాతిపెట్టబడ్డాడు.

  18. న్యాయాధిపతులు 8:33సుమారు క్రీ.పూ. 1245

    గిద్యోను చనిపోయిన వెంటనే ఇశ్రాయేలీయులు తిరిగి బయలుతో వ్యభిచారం చేశారు. వారు బయల్-బెరీతును తమ దేవునిగా చేసుకున్నారు,

  19. న్యాయాధిపతులు 8:34సుమారు క్రీ.పూ. 1245

    అన్నివైపులా ఉన్న తమ శత్రువులందరి చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు.

  20. న్యాయాధిపతులు 8:35సుమారు క్రీ.పూ. 1245

    వారు యెరుబ్-బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయుల కోసం చేసిన ఉపకారాలన్నీ మరచిపోయి అతని కుటుంబానికి ఇచ్చిన మాటను నమ్మకంగా నెరవేర్చలేదు.

  21. యెరుబ్-బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సోదరుల దగ్గరకు వెళ్లి వారితో, తన తల్లి కుటుంబీకులందరితో ఇలా అన్నాడు,

  22. “షెకెము యజమానులను అడగండి, ‘మీకు ఏది మంచిది: యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులు మిమ్మల్ని పాలించడమా లేదా ఒక్కడు పాలించడమా?’ అని అడగండి. నన్ను గుర్తుంచుకోండి నేను మీ సమీప రక్తసంబంధిని.”

  23. అతని తల్లి సోదరులు అతని గురించి షెకెము పౌరులకు చెప్పినప్పుడు వారు, “అతడు మా బంధువు” అని, అబీమెలెకును అనుసరించడానికి మొగ్గు చూపారు.

  24. వారు బయల్-బెరీతు క్షేత్రం నుండి డెబ్బై షెకెళ్ళ వెండితెచ్చి అబీమెలెకుకు ఇవ్వగా వాటితో అతడు అల్లరిమూకను కూలికి పెట్టుకున్నాడు, వారు అతని అనుచరులయ్యారు.

  25. అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, తన అన్నదమ్ములైన డెబ్బైమంది యెరుబ్-బయలు కుమారులను ఒకే బండ మీద చంపాడు. అయితే యెరుబ్-బయలు చిన్న కుమారుడైన యోతాము తప్పించుకుని దాక్కున్నాడు.