Gideon గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో మాంసాన్ని ఆ పులియని రొట్టెలను తాకినప్పుడు, అగ్ని ఆ రాతిలో నుండి బయటకు వచ్చి ఆ మాంసాన్ని రొట్టెలను కాల్చివేసింది, యెహోవా దూత అదృశ్యం అయ్యాడు.
వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, “అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!” అని ఆశ్చర్యపోయాడు.
అయితే యెహోవా అతనితో, “నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు” అన్నారు.
కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
ఆ రాత్రే యెహోవా అతనితో ఇలా అన్నారు, “నీ తండ్రి మందలో నుండి ఏడు సంవత్సరాల వయస్సున్న రెండవ కోడెను తీసుకో. నీ తండ్రి కట్టిన బయలు దేవత బలిపీఠాన్ని పడగొట్టు, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని విరగ్గొట్టు.
తర్వాత ఈ దుర్గం పైన సరియైన విధంగా నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టు. నీవు విరగ్గొట్టిన అషేరా స్తంభం కర్రను వాడుతూ ఆ రెండవ కోడెను దహనబలిగా అర్పించు.”
కాబట్టి గిద్యోను తన సేవకులలో పదిమందిని తీసుకెళ్లి యెహోవా తనతో చెప్పింది చేశాడు. కాని తన కుటుంబానికి, నగర ప్రజలకు భయపడి పగటి వేళలో కాకుండా రాత్రి వేళలో చేశాడు.
మిద్యానీయులందరు, అమాలేకీయులందరు, ఇతర తూర్పున ఉన్న ప్రజలందరూ కలిసివచ్చి యొర్దాను దాటి యెజ్రెయేలు లోయలో బస చేశారు.
అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను మీదికి రాగా, అతడు బూర ఊది అబీయెజెరు వంశస్థులను తనను వెంబడించుమని పిలుపునిచ్చాడు.
అతడు మనష్షే వారి దగ్గరికి దూతను పంపి తనను కలవమని చెప్పాడు, అలాగే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వారి దగ్గరకు కూడా దూతలను పంపాడు.
గిద్యోను దేవునితో, “మీరు వాగ్దానం చేసినట్టు నా ద్వారా ఇశ్రాయేలును రక్షించాలనుకుంటే,
చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు.
అలాగే జరిగింది. గిద్యోను మరుసటిరోజు ప్రొద్దున లేచి ఆ బొచ్చు మీద ఉన్న మంచును పిండినప్పుడు ఓ పాత్ర నిండా నీళ్లు వచ్చాయి.
అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోప్పడకండి, ఇంకొక్కటే అడుగుతాను. గొర్రెబొచ్చుతో ఇంకొక పరీక్షకు నన్ను అనుమతించండి. అయితే ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండి నేలంతా మంచు పడాలి” అన్నాడు.
ఆ రాత్రి దేవుడు అలానే చేశారు. నేలంతా మంచు పడింది కాని బొచ్చు పొడిగా ఉంది.
అయితే ఎఫ్రాయిమీయులు, “నీవు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నీవు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలువలేదు?” అని గిద్యోనుతో తీవ్రంగా వాదించారు.
అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా?
దేవుడు మిద్యానీయుల నాయకులైన ఓరేబు, జెయేబులను మీకు అప్పగించారు. మీతో పోల్చుకుంటే నేనేమి చేయగలిగాను?” అని అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది.
గిద్యోను, అతనితో ఉన్న మూడువందలమంది అలసిపోయిన కూడా శత్రువులను తరుముతూ యొర్దాను దగ్గరకు వచ్చి, దానిని దాటారు.
అతడు సుక్కోతు వారితో, “నా సైనికులకు కొంత ఆహారం ఇవ్వండి; వారు అలసిపోయి ఉన్నారు, నేను ఇంకా మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.
కాని సుక్కోతు అధికారులు, “జెబహు, సల్మున్నా అనే వారిని మీరు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేమెందుకు ఆహారమివ్వాలి?” అన్నారు.
అందుకు గిద్యోను, “జెబహు సల్మున్నాను యెహోవా మా చేతికి ఇచ్చిన తర్వాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
అక్కడినుండి అతడు పెనూయేలుకు వెళ్లి వారిని కూడా ఆహారం కోసం అలాగే అడిగినప్పుడు, వారు కూడా సుక్కోతు వారిలా జవాబిచ్చారు,
కాబట్టి అతడు పెనూయేలు మనుష్యులతో, “నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని చెప్పాడు.
అప్పుడు జెబహు, సల్మున్నా, ఇంచుమించు పదిహేను వేలమంది బలగంతో, అనగా తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలిన వారితో కర్కోరులో ఉన్నారు; లక్షా ఇరవై వేలమంది సైనికులు అప్పటికే చనిపోయారు.