కంటెంట్‌కు వెళ్లండి

Kings గురించి బైబిల్ వచనాలు: Jehoash or Joash

25 వచనాలు · 175 కోణాలు

Jehoash or Joash గురించి వచనాలు

  1. యూదా రాజైన యోవాషు పరిపాలనలోని ముప్పై ఏడవ సంవత్సరంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.

  2. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను చేస్తూనే ఉన్నాడు.

  3. యెహోయాషును పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  4. యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, యరొబాము అతని స్థానంలో సింహాసనం ఎక్కాడు. యెహోయాషును సమరయలో ఇశ్రాయేలు రాజులతో పాటు సమాధి చేశారు.

  5. ఆ కాలంలో ఎలీషాకు జబ్బుచేసింది, దానిని బట్టి తర్వాత అతడు చనిపోతాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతన్ని చూడడానికి వచ్చి అతన్ని చూసి, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు!” అని అంటూ ఏడ్చాడు.

  6. అతనితో ఎలీషా, “విల్లు, కొన్ని బాణాలు తీసుకో” అని చెప్పగా అతడు అలా చేశాడు.

  7. అతడు ఇశ్రాయేలు రాజుతో, “నీ చేతుల్లో విల్లును ఎక్కుపెట్టు” అన్నాడు. అతడు ఎక్కుపెట్టిన తర్వాత ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచాడు.

  8. ఎలీషా, “తూర్పున ఉన్న కిటికీ తెరువు” అన్నాడు, అతడు తెరిచాడు. ఎలీషా, “బాణం విసురు” అన్నాడు, రాజు బాణం విసిరాడు. ఎలీషా, “ఇది యెహోవా విజయ బాణం, అరాము మీద విజయ బాణం! నీవు ఆఫెకు దగ్గర అరామీయులను పూర్తిగా నాశనం చేస్తావు” అని ప్రకటించాడు.

  9. తర్వాత అతడు, “బాణాలు చేత పట్టుకో” అన్నాడు, రాజు వాటిని తీసుకున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “వాటితో నేలను కొట్టు” అన్నాడు. అతడు నేలను మూడుసార్లు కొట్టి ఆగాడు.

  10. దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.

  11. తర్వాత ఎలీషా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. అయితే ప్రతి వసంతకాలంలో మోయాబు దోపిడి మూకలు దేశంలోకి వచ్చేవారు.

  12. ఒకసారి కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక శవాన్ని సమాధి చేస్తుండగా అకస్మాత్తుగా దోపిడి మూకను చూసి ఆ మనిషి శవాన్ని ఎలీషా సమాధిలో పడేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే, ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి తన కాళ్లమీద నిలబడ్డాడు.

  13. యెహోయాహాజు పరిపాలన అంతటిలో, అరాము రాజైన హజాయేలు ఇశ్రాయేలు ప్రజలను బాధించాడు.

  14. అయితే యెహోవా తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి మీద జాలిపడి దయ చూపారు. ఈనాటి వరకు యెహోవా వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టడానికి ఇష్టపడలేదు.

  15. అరాము రాజైన హజాయేలు చనిపోయాడు, అతని తర్వాత అతని కుమారుడైన బెన్-హదదు రాజయ్యాడు.

  16. అప్పుడు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అంతకుముందు హజాయేలు యెహోయాహాజుతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్న పట్టణాలను హజాయేలు కుమారుడైన బెన్-హదదు నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మూడుసార్లు యెహోయాషు అతన్ని ఓడించి ఇశ్రాయేలు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

  17. తర్వాత అమజ్యా ఇశ్రాయేలు రాజూ యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు దగ్గరకు దూతలను పంపి, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని సవాలు చేశాడు.

  18. అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది.

  19. నీవు ఎదోమును ఓడించి గర్విస్తున్నావు, నీ విజయంతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”

  20. అయితే అమజ్యా వినలేదు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా, యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు.

  21. ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు.

  22. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు యెరూషలేముకు వచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.

  23. అతడు యెహోవా మందిరంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని తీసుకున్నాడు. అతడు బందీలను కూడా తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.

  24. యెహోయాషు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చర్రిత గ్రంథంలో వ్రాయబడలేదా?

  25. యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో ఇశ్రాయేలు రాజులతో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యరొబాము రాజయ్యాడు.