కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యరొబాము తనలో తాను అనుకున్నాడు, “ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది.

  2. ఒకవేళ ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి వెళ్తే, వారు మరల తమ ప్రభు, యూదా రాజైన రెహబాముకు తమ నమ్మకత్వాన్ని చూపుతారు. వారు నన్ను చంపి, రెహబాము రాజు వైపు తిరుగుతారు” అనుకున్నాడు.

  3. సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.

  4. అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.

  5. కాని ఇది ఒక పాపంగా మారింది; ప్రజలు బేతేలులో ఉన్నదానిని పూజించారు, దూరమైనా సరే దానుకు వెళ్లి అక్కడ ఉన్నదానిని పూజించారు.

  6. యరొబాము ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలు కట్టించి, లేవీయులు కాకపోయినా సరే, సాధారణ ప్రజలనే యాజకులుగా నియమించాడు.

  7. యూదాలో జరిగిన పండుగలాంటి ఒక పండుగను యరొబాము ఎనిమిదవ నెల పదిహేనవ రోజున ఏర్పాటు చేసి, బలిపీఠం మీద బలులు అర్పించాడు. అలా అతడు బేతేలులో తాను చేయించిన దూడలకు బలి అర్పించుట ద్వార చేశాడు. అంతేకాదు బేతేలులో తాను చేయించిన క్షేత్రాల్లో యాజకులను కూడా నియమించాడు.

  8. తాను స్వయంగా నిర్ణయించిన ప్రకారం ఎనిమిదవ నెల పదిహేనవ రోజు బేతేలులో తాను కట్టించిన బలిపీఠం మీద బలులు అర్పించాడు. కాబట్టి అతడు ఇశ్రాయేలీయుల కోసం పండుగను నిర్ణయించి, ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరకు వెళ్లాడు.

  9. యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.

  10. యెహోవా వాక్కు ప్రకారం అతడు బలిపీఠానికి వ్యతిరేకంగా బిగ్గరగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా చెప్పే మాట ఇదే: ‘దావీదు కుటుంబంలో యోషీయా అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు క్షేత్రాల మీద బలులు అర్పించే యాజకులను నీ మీద వధిస్తాడు, మనుష్యుల ఎముకలు నీ మీద కాల్చబడతాయి.’ ”

  11. అదే రోజు ఆ దైవజనుడు ఒక సూచన ఇచ్చాడు: “యెహోవా చెప్పిన సూచన ఇదే: బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికి పోతుంది.”

  12. రాజైన యరొబాము బేతేలులో ఉన్న బలిపీఠం గురించి దైవజనుడు ప్రకటించిన మాట విని, బలిపీఠం మీద నుండి తన చేయి చాపి, “అతన్ని పట్టుకోండి!” అన్నాడు. అయితే అతడు చాపిన చేయి తిరిగి వెనుకకు తీసుకోలేకుండా అది ఎండిపోయింది.

  13. అంతేకాక, యెహోవా వాక్కు ద్వారా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారం బలిపీఠం బద్దలై దానిమీది నుండి బూడిద ఒలికిపోయింది.

  14. అప్పుడు రాజు ఆ దైవజనునితో, “నా మీద దయచూపి నా చేయి బాగుపడేలా నా కోసం నీ దేవుడైన యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేయి” అన్నాడు. దైవజనుడు యెహోవాను వేడుకున్నప్పుడు రాజు చేయి పూర్తిగా బాగుపడి ముందులా అయ్యింది.

  15. అప్పుడు రాజు దైవజనునితో, “భోజనం చేయడానికి నాతో ఇంటికి రా, నీకు బహుమానం ఇస్తాను” అన్నాడు.

  16. అయితే దైవజనుడు రాజుకు జవాబిస్తూ అన్నాడు, “నీ ఆస్తిలో సగం నాకు ఇచ్చినా సరే, నేను నీతో వెళ్లను, నేను ఇక్కడ భోజనం చేయను, నీళ్లు త్రాగను.

  17. ఎందుకంటే ‘నీవు భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా నాకు ఆజ్ఞాపించారు.”

  18. కాబట్టి అతడు బేతేలుకు వచ్చిన దారిన కాక, మరో దారిన తిరిగి వెళ్లాడు.

  19. ఆ కాలంలో బేతేలులో ఒక వృద్ధుడైన ప్రవక్త ఉండేవాడు. అతని కుమారులు వచ్చి ఆ రోజు అక్కడ ఆ దైవజనుడు చేసిందంతా అతనికి చెప్పారు. అతడు రాజుతో ఏమి చెప్పాడో కూడా తమ తండ్రికి చెప్పారు.

  20. వారి తండ్రి వారిని, “అతడు ఏ దారిన వెళ్లాడు?” అని అడిగాడు. అతని కుమారులు యూదా నుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారి చూపించారు.

  21. కాబట్టి అతడు తన కుమారులతో, “గాడిదకు జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిద మీద జీను వేశారు, అతడు గాడిదను ఎక్కి,

  22. ఆ దైవజనుని వెదుకుతూ వెళ్లాడు. అతడు సింధూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూసి ఆ ప్రవక్త, “యూదా నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని అడిగాడు. “నేనే” అని అతడు జవాబిచ్చాడు.

  23. కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.

  24. అందుకు ఆ దైవజనుడు, “నేను తిరిగి మీతో రాలేను, మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గాని, నీళ్లు గాని పుచ్చుకోలేను.

  25. యెహోవా వాక్కు ద్వారా నేను ఇలా ఆదేశించబడ్డాను: ‘నీవు అక్కడ భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, నీవు వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా వాక్కు ద్వారా నేను ఆదేశించబడ్డాను” అన్నాడు.