కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు.

  2. యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”

  3. యెహోషాపాతు, యెరూషలేములో కూడా కొంతమంది లేవీయులను, యాజకులను ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దలను యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివాదాలను పరిష్కరించడానికి నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.

  4. అతడు వారికి ఈ ఆజ్ఞలు జారీ చేశాడు: “యెహోవాయందు భయం కలిగి, మీరు నమ్మకంగా యధార్థహృదయంతో సేవ చేయాలి.

  5. పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.

  6. “యెహోవాకు సంబంధించిన ప్రతి విషయంలోను ముఖ్య యాజకుడైన అమర్యా మీమీద అధికారిగా ఉంటాడు, అలాగే రాజుకు సంబంధించిన ప్రతి విషయంలోను యూదా గోత్ర నాయకుడు ఇష్మాయేలు కుమారుడైన జెబద్యా మీమీద అధికారిగా ఉంటాడు, లేవీయులు మీ ఎదుట అధికారులుగా ఉండి సేవ చేస్తారు. ధైర్యంగా ఉండండి, మంచిని జరిగించే వారికి యెహోవా తోడుగా ఉండును గాక.”

  7. యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు.

  8. సాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు; ఆయనను సహాయం అడగడానికి యూదాలోని ప్రతి పట్టణం నుండి ప్రజలు వచ్చారు.

  9. అప్పుడు యెహోషాపాతు యూదా, యెరూషలేము సమాజంలో క్రొత్త ప్రాంగణం ముందు ఉన్న యెహోవా మందిరంలో నిలబడి,

  10. ఇలా ప్రార్థించాడు: “యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు.

  11. మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా?

  12. వారు ఇక్కడ నివాసముండి మీ పేరట ఇక్కడ పరిశుద్ధాలయం కట్టారు.

  13. వారు, ‘ఒకవేళ మా మీదికి విపత్తుగానీ, తీర్పు అనే ఖడ్గమే గాని తెగులే గాని కరువే గాని వస్తే మీ నామం కలిగిన ఈ మందిరం ముందు మేము మీ సన్నిధిలో నిలబడి మా ఆపదలో మీకు మొరపెడితే మీరు మా మొర విని మమ్మల్ని రక్షిస్తారు’ అన్నారు.

  14. “అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోను, మోయాబు, శేయీరు పర్వతం నుండి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి మీరు అనుమతించలేదు; కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి నుండి వెళ్లిపోయారు.

  15. మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు మమ్మల్ని తోలివేయడానికి వచ్చి వారు మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి.

  16. మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా? ఎందుకంటే మాపై దాడి చేస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీ సహాయం కోసమే చూస్తున్నాము.”

  17. యూదా వారంతా తమ భార్యాపిల్లలు, పసివారితో సహా అక్కడ యెహోవా ముందు నిలబడి ఉన్నారు.

  18. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు పుట్టిన జెకర్యా కుమారుడును లేవీయుడునైన ఆసాపు సంతతివాడైన యహజీయేలు మీదికి యెహోవా ఆత్మ వచ్చాడు.

  19. అప్పుడు యహాజీయేలు ఇలా ప్రకటించాడు: “యెహోషాపాతు రాజా, యూదా యెరూషలేము నివాసులారా మీరందరు వినండి! యెహోవా మీతో చెప్పే మాట ఇదే: ‘ఈ మహా సైన్యాన్ని చూసి భయపడకండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే యుద్ధం మీది కాదు, దేవునిది.

  20. అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడనవసరం ఉండదు. మీరు మీ స్థలాల్లో నిలబడి ఉండండి; యెహోవా మీకిచ్చే విడుదలను మీరు నిలబడి చూడండి. యూదా, యెరూషలేమా, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. యెహోవా మీతో ఉంటారు.’ ”

  21. అప్పుడు యెహోషాపాతు నేలకు సాష్టాంగపడి నమస్కరించాడు; యూదా, యెరూషలేము ప్రజలందరూ యెహోవా సన్నిధిలో ఆరాధించారు.

  22. కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.

  23. తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు”

  24. ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”

  25. వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు.