Ammonites గురించి బైబిల్ వచనాలు: Prophecies concerning
Prophecies concerning గురించి వచనాలు
“కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.
వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”
కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను:
అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;
ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,
అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;
ఎదోము, మోయాబు, అమ్మోను;
యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో, యెహోవా నుండి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:
యెహోవా నాతో ఇలా అన్నారు: “సంకెళ్లు ఒక కాడిని తయారుచేసి నీ మెడ మీద పెట్టుకో.
యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.
తమ యజమానుల తెలియజేయమని వారికి ఈ సందేశం ఇవ్వు, ‘ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు మీ యజమానులకు ఇలా చెప్పండి:
నా గొప్ప శక్తితో చాచిన బాహువుతో నేను భూమిని, దాని ప్రజలను దానిపై ఉన్న జంతువులను సృష్టించాను. నేను ఎవరు సరైన వారనుకుంటే వారికి దానిని ఇస్తాను.
ఇప్పుడు నేను నీ దేశాలన్నిటిని నా సేవకుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను; అడవి జంతువులను కూడా అతనికి లోబడి చేస్తాను.
అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు.
“ ‘ “అయితే, ఏదైనా దేశం గాని రాజ్యం గాని బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేయకపోయినా అతని కాడి క్రింద మెడ వంచకపోయినా, నేను ఆ దేశాన్ని కత్తితో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను, అతని చేతితో దానిని పూర్తిగా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.
కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు.
మిమ్మల్ని మీ దేశం నుండి దూరం చేయడానికే వారు మీతో అబద్ధాలు ప్రవచిస్తారు; నేను నిన్ను వెళ్లగొడతాను మీరు నశిస్తారు.
అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ”
అమ్మోనీయుల గురించి: యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఇశ్రాయేలుకు వారసుడు లేడా? మోలెకు గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?
అయితే ఆ రోజులు రాబోతున్నాయి” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా నేను యుద్ధధ్వని చేసినప్పుడు; అది శిథిలాల దిబ్బ అవుతుంది, దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. అప్పుడు ఇశ్రాయేలు దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” అని యెహోవా అంటున్నారు.
“హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.
మీ లోయలు చాలా ఫలవంతమైనవి, అని మీరు మీ లోయల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? అమ్మోనూ, నమ్మకద్రోహియైన కుమార్తె, నీవు నీ సంపదపై నమ్మకం ఉంచి, ‘నాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అంటున్నావు.
నీ చుట్టూ ఉన్న వారందరి నుండి నీకు భయం పుట్టిస్తాను” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. “మీలో ప్రతి ఒక్కరు తరిమివేయబడతారు, పారిపోయినవారిని ఎవరూ సమకూర్చరు.