God
God ను ప్రస్తావించే వచనాలు
“ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది మీమీద సాక్షిగా ఉంటుంది.
ఎందుకంటే మీ తిరుగుబాటుతనం, మొండితనం నాకు తెలుసు. నేను ఇంకా మీతో బ్రతికి ఉన్నప్పుడే మీరు యెహోవాపై తిరుగుబాటు చేస్తే, నేను చనిపోయిన తర్వాత మీరు ఇంకెంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా!
ఎందుకంటే నేను చనిపోయాక మీరు పూర్తిగా అవినీతిపరులై నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు తొలగిపోతారని నాకు తెలుసు. రాబోయే రోజుల్లో, మీరు యెహోవా దృష్టికి చెడు చేసి, మీ చేతులు చేసిన వాటి వల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో విపత్తు మీ మీదికి వస్తుంది.”
నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి!
ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.
ఆయన ప్రజలు అవినీతిపరులు, వారు ఆయన పిల్లలు కారు; వారి అవమానం పొందిన మూర్ఖులైన వక్ర తరం వారు.
అవివేకులైన తెలివితక్కువ ప్రజలారా, యెహోవాకు మీరు తిరిగి చెల్లించే విధానం ఇదేనా? మిమ్మల్ని చేసిన, మిమ్మల్ని రూపించిన, మీ తండ్రి, మీ సృష్టికర్త ఆయన కాడా?
మహోన్నతుడు జనాంగాలకు వారి వారి వారసత్వాలను ఇచ్చినప్పుడు, సర్వ మనుష్యజాతిని విభజించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య ప్రకారం జనములకు ఆయన సరిహద్దులు ఏర్పరిచారు.
యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము.
ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో, శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు. తన గూడును కదిలించి, తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే, వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా, ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ, తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు.
యెహోవా ఒక్కడే అతన్ని నడిపించారు; ఏ ఇతర దేవుడు అతనితో ఉండలేదు.
యెషూరూను క్రొవ్వుపట్టి కాలు జాడించాడు; తిండి ఎక్కువై, వారు బలిసి మొద్దులయ్యారు. వారు తమను చేసిన దేవున్ని విసర్జించి రక్షకుడైన తమ ఆశ్రయ దుర్గాన్ని తృణీకరించారు.
వారు ఇతర దేవుళ్ళ వల్ల ఆయనకు రోషం పుట్టించారు, వారి అసహ్యకరమైన విగ్రహాలతో ఆయనకు కోపం కలిగించారు.
దేవుడు కాని దయ్యాలకు వారు బలులర్పించారు తమకు తెలియని దేవుళ్ళకు, క్రొత్తగా వచ్చిన దేవుళ్ళకు, మీ పూర్వికులు లెక్కచెయ్యని దేవుళ్ళకు మ్రొక్కారు.
మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు; మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు.
యెహోవా ఇది చూసి వారిని తృణీకరించారు, ఎందుకంటే ఆయన తన కుమారులు కుమార్తెల వల్ల కోప్పడ్డారు.
“నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారి అంతం ఎలా ఉంటుందో చూస్తాను; ఎందుకంటే వారొక దుర్బుద్ధి కలిగిన తరం, నమ్మకద్రోహులైన పిల్లలు.
దేవుడు కాని దానితో వారు నాకు రోషం పుట్టించారు, అయోగ్యమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. జనులు కాని వారిని చూసి వారు అసూయపడేలా చేస్తాను; తెలివిలేని జనులను చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
“నేను ఆపదలను వారిపై కుప్పగా చేస్తాను, నా బాణాలను వారి మీదికి వేస్తాను.
నేను వారి మీదికి తీవ్రమైన కరువును పంపుతాను, తీవ్ర జ్వరం, మరణకరమైన తెగులు వారిని వేధిస్తాయి, నేను అడవి మృగాల కోరలను, దుమ్ములో ప్రాకే ప్రాణుల విషాన్ని నేను వారి మీదికి పంపుతాను.
నేను వారిని చెదరగొడతాను, మానవ జ్ఞాపకంలో నుండి వారి పేరును తుడిచివేస్తాను.
కాని వారి శత్రువులు తప్పుగా అర్థం చేసుకుని, ‘ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలంతోనే గెలిచాం’ అని అంటారేమోనని శత్రువుల దూషణకు భయపడి అలా చేయలేదు.”
తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?
“వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది, దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?
పగ తీర్చుకోవడం నా పని; నేను తిరిగి చెల్లిస్తాను. సరియైన సమయంలో వారి పాదం జారుతుంది; వారి ఆపద్దినం దగ్గరపడింది వారి విధి వేగంగా వారి మీదికి వస్తుంది.”