Solomon గురించి బైబిల్ వచనాలు: Covenant renewed in a vision after the dedication of the temple
Covenant renewed in a vision after the dedication of the temple గురించి వచనాలు
సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించి తాను కోరుకున్నదంతా సాధించిన తర్వాత,
యెహోవా గిబియోనులో సొలొమోనుకు ప్రత్యక్షమైనట్లు రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యారు.
యెహోవా అతనితో ఇలా అన్నారు: “నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన విన్నపం విన్నాను; నీవు కట్టించిన ఈ మందిరంలో నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను దీనిని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
“నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా యథార్థత నిజాయితీగల హృదయంతో జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,
నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని వాగ్దానం చేసినట్లు నీ రాజ్యసింహాసనాన్ని ఎల్లకాలం ఇశ్రాయేలు మీద స్థాపిస్తాను.
“అయితే ఒకవేళ మీరు గాని మీ సంతానం గాని నాకు విరుద్ధంగా తిరిగి, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు పాటించకుండా ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే,
అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలో వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వజనాంగాల మధ్య ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.
ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, అపహాస్యం చేస్తూ, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.
అప్పుడు ప్రజలు, ‘వారు తమ పూర్వికులను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”
ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను.
“వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని,
ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను.
ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను.
ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
“నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,
నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని నిబంధన చేసినట్లు నీ రాజ సింహాసనం ఎల్లకాలం స్థాపిస్తాను.
“అయితే ఒకవేళ మీరు నన్ను అనుసరించుట మాని, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే,
అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన నా దేశం నుండి వారిని పెళ్లగించి నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. నేను దాన్ని ప్రజలందరిలో సామెతగా, హేళనకు కారణంగా చేస్తాను.
ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.
అప్పుడు ప్రజలు, ‘వారు తమను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని, పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”