Solomon గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
మీ దేవుడైన యెహోవా ఏర్పరచే వ్యక్తినే మీరు రాజుగా నియమించుకోవాలి. అతడు మీ మధ్యలో నుండి వచ్చిన తోటి ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు కాని పరదేశిని మీమీద నియమించకూడదు.
అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు.
అతడు చాలామంది భార్యలను చేసుకోకూడదు, లేదా అతని హృదయం దారి తప్పుతుంది. అతడు పెద్ద మొత్తంలో వెండి, బంగారాన్ని కూడబెట్టుకోకూడదు.
నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.
నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.
నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.
నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు;
యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.
అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?
కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని కాపాడుకోడానికి నేను నీకొక సలహా ఇస్తాను.
నీవు రాజైన దావీదు దగ్గరకు వెళ్లి, ‘నా ప్రభువా, రాజా, “నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడు నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు” అని మీరు నాకు ప్రమాణం చేయలేదా? ఇప్పుడు అదోనియా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
నీవు ఇంకా రాజుతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలికి వచ్చి మీ మాటలను బలపరుస్తాను” అని సలహా ఇచ్చాడు.
కాబట్టి బత్షెబ తన గదిలో ఉన్న వృద్ధుడైన రాజు దగ్గరకు వెళ్లింది. అక్కడ షూనేమీయురాలైన అబీషగు రాజుకు సేవ చేస్తూ ఉంది.
బత్షెబ రాజు ఎదుట తలవంచి, సాగిలపడింది. “నీకేమి కావాలి?” అని రాజు అడిగాడు.
ఆమె అతనితో ఇలా అన్నది, “నా ప్రభువా, మీరు మీ దేవుడైన యెహోవా పేరిట మీ దాసురాలనైన నాతో ఇలా ప్రమాణం చేసి, ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజుగా నా సింహాసనం మీద కూర్చుంటాడు’ అని అన్నారు.
కాని ఇప్పుడు అదోనియా రాజయ్యాడు, నా ప్రభువా, రాజువైన మీకు దీని గురించి తెలియదు.
అతడు విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి అర్పించి, రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సేనాధిపతియైన యోవాబును ఆహ్వానించాడు కాని మీ సేవకుడైన సొలొమోనును ఆహ్వానించలేదు.
నా ప్రభువా నా రాజా, మీ తర్వాత మీ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయులందరు ఎదురుచూస్తున్నారు.
అంతేకాక, నా ప్రభువైన రాజు మరణించి తన పూర్వికులను చేరిన వెంటనే, నేను నా కుమారుడైన సొలొమోను నేరస్థులుగా పరిగణించబడతాము.”
ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే, ప్రవక్తయైన నాతాను వచ్చాడు.
“నాతాను ప్రవక్త ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటకు వెళ్లి తలవంచి సాష్టాంగపడ్డాడు.
నాతాను, “నా ప్రభువా, నా రాజా, అదోనియా మీ తర్వాత రాజవుతాడని, మీ సింహాసనం మీద కూర్చుంటాడని మీరు ప్రకటించారా?
ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు.