Abraham గురించి బైబిల్ వచనాలు: Trial of his faith in the offering of Isaac
Trial of his faith in the offering of Isaac గురించి వచనాలు
కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు. “చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
అప్పుడు దేవుడు ఇలా అన్నారు, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు.”
మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి గాడిదకు గంతలు కట్టి ఇద్దరు పనివారిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దహనబలి కోసం కట్టెలు కొట్టుకుని దేవుడు చూపిన స్థలం వైపు వెళ్లాడు.
మూడవ రోజు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూశాడు.
అబ్రాహాము తన పనివారితో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అని అన్నాడు.
అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు,
ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, “తండ్రీ” అని పిలిచాడు. “నా కుమారుడా, ఏంటి?” అని అబ్రాహాము జవాబిచ్చాడు. ఇస్సాకు, “నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు.
“నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.
దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు.
తర్వాత అబ్రాహాము తన కుమారున్ని బలి ఇవ్వడానికి చేయి చాపి కత్తి పట్టుకున్నాడు.
అయితే యెహోవా దూత ఆకాశం నుండి, “అబ్రాహామూ! అబ్రాహామూ!” అని పిలిచాడు. “చిత్తం ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
“ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అని దేవుని దూత మాట్లాడాడు.
అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు.
అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది.
యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు,
“యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి,
నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు,
నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.”
తర్వాత అబ్రాహాము తన పనివారి దగ్గరకు తిరిగి వెళ్లాడు, వారు కలిసి బెయేర్షేబకు వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో నివసించాడు.
దేవుడు అబ్రాహామును పరీక్షించినపుడు, విశ్వాసం ద్వారానే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. “ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది” అని దేవుడు అతనితో చెప్పినప్పటికి, వాగ్దానాలను పొందిన అబ్రాహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చనిపోయినవారిని సహితం లేపడానికి దేవుడు శక్తిమంతుడని అబ్రాహాము భావించాడు, దానిని ఉపమానరీతిలో చెప్పాలంటే అతడు తన కుమారుడైన ఇస్సాకును మరణం నుండి తిరిగి పొందుకున్నాడు.
మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా?