మత్తయి12
Listen to this chapter
0:00
0:00
1
ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులకు ఆకలివేసి కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు.
2
అది చూసిన పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
3
అందుకు ఆయన వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?
4
అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తనతో ఉన్నవారు తిన్నారు కదా!
5
యాజకులు సబ్బాతు దినాన దేవాలయం విధులను నిర్వహించడం కూడా సబ్బాతు దినాన్ని అపవిత్ర పరచినట్లే అయినాసరే వారు నిర్దోషులని ధర్మశాస్త్రంలో చదవలేదా?
6
దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్తున్నాను.
7
‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు.
8
ఎందుకంటే మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
9
ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు.
10
అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న కొందరు, “సబ్బాతు దినాన బాగుచేయడం ధర్మశాస్త్రానుసారమా?” అని అడిగారు.
11
అందుకు యేసు వారితో, “మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది సబ్బాతు దినాన గుంటలో పడితే దానిని పట్టుకుని బయటకు తీయకుండా ఉంటారా?
12
గొర్రె కంటే మనిషి విలువ ఎంతో ఎక్కువ కదా! కాబట్టి సబ్బాతు దినాన మంచి చేయడం ధర్మశాస్త్ర ప్రకారం న్యాయమే” అన్నారు.
13
ఆయన ఆ వ్యక్తితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే అది రెండవ చేయిలా పూర్తిగా బాగయింది.
14
కానీ పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపుదామా అని ఆయన మీద పన్నాగం పన్నారు.
15
యేసు ఆ సంగతిని తెలుసుకొని అక్కడినుండి వెళ్లిపోయారు. చాలా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన రోగులందరిని బాగుచేశారు.
16
ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు.
17
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే:
18
“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
19
ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు.
20
న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు.
21
దేశాలు ఈయన నామంలో నిరీక్షణ కలిగి ఉంటాయి.”
22
అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవానిగా ఉండిన ఒకనిని కొందరు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, వాడు చూడగలుగునట్లు మాట్లాడగలుగునట్లు యేసు వానిని బాగుచేశారు.
23
కాబట్టి ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు.
24
కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు, “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
25
యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు.
26
ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది?
27
ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు.
28
కానీ ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.
29
“ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.
30
“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.
31
అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను.
32
మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు.
33
“చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది.
34
సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.
35
మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు.
36
కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కోసం తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే.
37
ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”
38
అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు.
39
అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు.
40
ఎలాగైతే యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడు.
41
నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.”
42
దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది.
43
“అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు.
44
అప్పుడది, ‘నేను వదిలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరు లేకపోవడం, పైగా శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది.
45
అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది. ఈ దుష్టతరం కూడా అలాగే ఉంటుంది” అని చెప్పారు.
46
యేసు ఆ జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు.
47
అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.
48
అందుకు యేసు అతనికి, “నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?” అని చెప్పి
49
తన శిష్యులను చూపిస్తూ, “వీరే నా తల్లి, నా సహోదరులు.
50
ఎందుకంటే నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి” అని జవాబిచ్చారు.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note