Tribe Of Benjamin గురించి బైబిల్ వచనాలు: Almost annihilated for protecting the men of Gibeah
Almost annihilated for protecting the men of Gibeah గురించి వచనాలు
ఇశ్రాయేలు గోత్రాల వారు బెన్యామీను గోత్రమంతటికి దూతలను పంపి అన్నారు, “మీ మధ్య జరిగిన ఈ నీచమైన నేరం సంగతి ఏమిటి?
ఇప్పుడు గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించండి, మేము వారిని చంపి ఇశ్రాయేలులో ఈ దుష్టత్వం లేకుండా చేస్తాము.” కాని బెన్యామీనీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల మాట వినలేదు.
ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి, బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి గిబియా దగ్గరకు కలిసి వచ్చారు.
ఆ రోజు గిబియాలో నివసిస్తున్న ఏడువందలమంది శూరులకు అధనంగా బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి కత్తియుద్ధం చేయగలిగే ఇరవై ఆరు వేలమందిని పోగుచేసుకున్నారు.
వీరందరిలో ఎడమచేతి వాటంగల వారు ఏడువందలమంది ప్రత్యేకమైన వారున్నారు, ఒక్కొక్కరు వడిసెలలో రాయి పెట్టి, తల వెంట్రుకలనైనా గురి తప్పకుండా కొట్టగలరు.
బెన్యామీను వారు కాకుండా, ఇశ్రాయేలు వారు కత్తియుద్ధం చేయగలిగే, అనుభవజ్ఞులైన నాలుగు లక్షల మందిని పోగుచేసుకున్నారు.
ఇశ్రాయేలీయులు బేతేలుకు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేస్తూ, “బెన్యామీనీయుల మీద యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్లాలి?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “యూదా వారే ముందు వెళ్లాలి” అన్నారు.
మరుసటిరోజు ఉదయం ఇశ్రాయేలీయులు లేచి గిబియా దగ్గర మకాం వేశారు.
ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి గిబియా దగ్గర వారికి ఎదురుగా బారులు తీరారు.
ఆ రోజు బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి, యుద్ధభూమిలో ఇరవైరెండువేలమంది ఇశ్రాయేలీయులను హతం చేశారు.
అయితే ఇశ్రాయేలీయులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని మొదట రోజున ఉన్న చోటనే మళ్ళీ యుద్ధానికి బారులు తీరారు.
ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా ఎదుట సాయంత్రం వరకు ఏడ్చి, “మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీదికి మళ్ళీ యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “వారి మీదికి వెళ్లండి” అన్నారు.
అప్పుడు రెండవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను సమీపించారు.
ఈసారి వారిని ఎదుర్కోడానికి గిబియా నుండి వచ్చిన బెన్యామీనీయులు పద్దెనిమిదివేలమందిని ఇశ్రాయేలీయులను, హతం చేశారు, వారంతా ఆయుధాలు కలవారు.
అప్పుడు ఇశ్రాయేలీయులందరు, సైన్యమంతా బేతేలుకు వెళ్లి అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుని ఏడ్చారు. వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దహనబలులు సమాధానబలులు యెహోవాకు అర్పించారు.
ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు. (ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం అక్కడ ఉండేది,
అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దాని ముందు నిలబడి సేవ చేసేవాడు.) వారు అడిగారు, “మేము వెళ్లి మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీద యుద్ధానికి వెళ్లాల వద్దా?” యెహోవా జవాబిస్తూ, “వెళ్లండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను” అన్నారు.
ఆ తర్వాత ఇశ్రాయేలు వారు గిబియా చుట్టూ మాటు వేశారు.
మూడవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వెళ్లి, మునుపటిలా గిబియాను ఎదురుగా యుద్ధానికి బారులు తీరారు.
వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.
“మునుపటిలా మనం వారిని ఓడిస్తున్నాం” అని బెన్యామీనీయులు అనేటప్పుడు ఇశ్రాయేలీయులు, “మనం పరుగెత్తి వారు తమ పట్టణం నుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.
ఇశ్రాయేలు వారందరు తామున్న చోట్ల నుండి బయలుదేరి బయల్-తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటున ఉన్న ఇశ్రాయేలీయులు తమ స్థలం నుండి గెబాకు పడమటి వైపు నుండి దాడి చేశారు.
అప్పుడు ఇశ్రాయేలీయులలో పదివేలమంది శూరులైన యువకులు గిబియా ఎదురుగా వచ్చి దాడి చేశారు. యుద్ధం ఎంతో తీవ్రంగా ఉండడంతో బెన్యామీనీయులు తమకు ఆపద రాబోతుందని గ్రహించలేదు.
యెహోవా ఇశ్రాయేలీయుల చేతిలో బెన్యామీనీయులను ఓడించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 25,100 మంది బెన్యామీనీయులను చంపారు. వారంతా కత్తి పట్టినవారే.
అప్పుడు తాము ఓటమి పాలయ్యామని బెన్యామీనీయులు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు దారి ఇచ్చారు.