God
God ను ప్రస్తావించే వచనాలు
యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది.
ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది.
నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది.
ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు.
నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.
నీ అపరాధాన్ని ఒప్పుకో నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు, నీవు ప్రతి మహా వృక్షం క్రింద పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు, నాకు విధేయత చూపలేదు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను.
అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు.
ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు.
ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు.
ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.
“నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను.
కానీ తన భర్తకు ద్రోహం చేసిన స్త్రీలా ఇశ్రాయేలూ, నీవు నాకు నమ్మకద్రోహం చేశావు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.
“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.
నిశ్చయంగా కొండలు, పర్వతాలమీద జరుగుతున్న విగ్రహారాధన అల్లకల్లోలం మోసమే; ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాలో ఇశ్రాయేలు రక్షణ.
మనం అవమానంలో పడి ఉందాం, మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము. మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము, మనమూ, మన పూర్వికులు; మా యవ్వనం నుండి నేటి వరకు మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు.”
“ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే, నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే ఇక దారి తొలగకుండా ఉంటే,
మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి, ‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే, అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి, వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.”
యూదా వారికి, యెరూషలేముకు యెహోవా ఇలా చెప్తున్నారు: “దున్నబడని నీ నేలను పగులగొట్టు ముళ్ళ మధ్య విత్తవద్దు.
మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలను సున్నతి చేసుకోండి, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, లేకపోతే మీరు చేసిన చెడును బట్టి నా కోపం అగ్నిలా మండుతుంది, ఆర్పడానికి ఎవరూ ఉండరు.
కాబట్టి గోనెపట్ట ధరించుకుని, విలపించండి, ఏడవండి, యెహోవా యొక్క భయంకరమైన కోపం మనల్ని విడిచిపెట్టలేదు.
యెహోవా ఇలా అంటున్నాడు, “ఆ రోజు రాజు, అధికారులు ధైర్యం కోల్పోతారు, యాజకులు భయపడతారు, ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”
అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా! ఖడ్గం మా గొంతు మీద ఉన్నప్పుడు, ‘మీకు సమాధానం కలుగుతుంది’ అని చెప్పి మీరు ఈ ప్రజలను, యెరూషలేమును ఎంత ఘోరంగా మోసం చేశారు!”