Laban గురించి బైబిల్ వచనాలు: Outwitted by Jacob
Outwitted by Jacob గురించి వచనాలు
అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.
తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి.
అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి.
యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు.
మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు.
ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి.
ఈ విధంగా యాకోబు ఎంతో అభివృద్ధి చెందాడు, గొప్ప మందలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను సొంతం చేసుకున్నాడు.
లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.
లాబాను వైఖరి తన పట్ల ముందు ఉన్నట్లు లేదు అని యాకోబు గ్రహించాడు.
అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ పూర్వికుల దేశానికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లు, నేను నీతో ఉంటాను” అని చెప్పారు.
యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు.
వారితో అన్నాడు, “మీ తండ్రి వైఖరి నా పట్ల ముందులా లేదని నేను గమనించాను, కానీ నా తండ్రి యొక్క దేవుడు నాతో ఉన్నారు.
నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు,
అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు.
ఒకవేళ అతడు, ‘పొడలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, మందలన్నీ పొడలు గల పిల్లలనే ఈనాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలనే ఈనాయి.
ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు.
“మందలు చూలు కట్టే కాలంలో నాకొక కల వచ్చింది, అందులో మందతో వెళ్లిన మేకపోతులు చారలు, పొడలు లేదా మచ్చలతో ఉండడం నేను చూశాను.
కలలో దేవదూత నాతో, ‘యాకోబు’ అని పిలిచాడు. ‘చిత్తం, నేను ఉన్నాను’ అని జవాబిచ్చాను.
అతడు నాతో, ‘కళ్ళెత్తి చూడు, మందతో కూడుకుంటున్న మేకపోతులు పొడలు, మచ్చలు లేదా చారలతో ఉన్నాయి, ఎందుకంటే లాబాను నీకు చేసిందంతా నేను చూశాను.
నీవు ఎక్కడైతే ఒక స్తంభాన్ని అభిషేకించి నాకు మ్రొక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలు యొక్క దేవున్ని నేనే. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీ స్వదేశానికి వెళ్లు’ అని అన్నారు.”
అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా?
అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు.
దేవుడు మా తండ్రి దగ్గర తీసివేసిన ఆస్తి ఖచ్చితంగా మనకు మన పిల్లలకు చెందినది. కాబట్టి దేవుడు నీకేమి చెప్తే అది చేయి” అని అన్నారు.
కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి,
తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు.