Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు.

  2. కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు, దేవుని స్వరూపంలో వారిని సృజించారు; వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.

  3. దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు.

  4. ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి.

  5. ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు.

  6. ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు.

  7. యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే.

  8. భూమి మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు,

  9. అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి.

  10. యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు.

  11. యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు.

  12. యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి.

  13. ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది.

  14. ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది.

  15. ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి.

  16. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటా పారుతుంది.

  17. మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు.

  18. ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు.

  19. యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు;

  20. కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు.

  21. యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.

  22. యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది.

  23. ఆ మనుష్యుడు పశువులన్నిటికి, ఆకాశపక్షులకు, అడవి జంతువులన్నిటికి పేర్లు పెట్టాడు. అయితే మనుష్యునికి తగిన తోడు దొరకలేదు.

  24. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు.

  25. అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు.