God
God ను ప్రస్తావించే వచనాలు
అయితే సమాజమంతా వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమావేశ గుడారం దగ్గర ఇశ్రాయేలీయులందరికి కనిపించింది.
యెహోవా మోషేతో, “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను ధిక్కరిస్తారు? నేను వారి మధ్య అన్ని సూచనలు చేసినప్పటికీ, వారు నన్ను నమ్మడానికి ఎంతకాలం నిరాకరిస్తారు?
తెగులుతో వారిని మొత్తి నాశనం చేస్తాను, అయితే వీరిని మించిన బలమైన గొప్ప ప్రజలుగా నిన్ను చేస్తాను” అని అన్నారు.
మోషే యెహోవాతో, “ఈజిప్టువారు దాని గురించి విన్నప్పుడు వారు ఏమనుకుంటారు? మీ ప్రభావం చేత వారి మధ్య నుండి వీరిని తెచ్చారు.
ఈ దేశ నివాసులకు దానిని గురించి వారు చెప్తారు. ఇప్పటికే మీరు యెహోవా, ఈ ప్రజలతో ఉన్నారని, మీరు ముఖాముఖిగా వీరికి కనిపిస్తారని, మీ మేఘము వీరితో ఉంటుందని, మీరు పగలు మేఘస్తంభంలో, రాతి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తారని వారు విన్నారు.
ఒకవేళ ఎవరిని విడిచిపెట్టకుండా ఈ ప్రజలందరినీ చంపేస్తే, మీ గురించి ఈ విషయాలు విన్న దేశాలు,
‘యెహోవా ఈ ప్రజలకు మ్రొక్కుబడిగా వాగ్దానం చేసిన స్థలానికి తీసుకెళ్లలేక, వీరిని అరణ్యంలో చంపేశారు’ అని అంటారు.
“కాబట్టి మీరు ప్రకటించినట్లే, ఇప్పుడు ప్రభువు యొక్క బలం కనుపరచబడును గాక:
‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’
మీ గొప్ప ప్రేమను బట్టి, ఈ ప్రజల పాపాన్ని, ఈజిప్టు వదిలినప్పటి నుండి ఇప్పటివరకు వీరిని క్షమించిన ప్రకారం క్షమించండి” అని అన్నాడు.
యెహోవా జవాబిస్తూ, “నీవడిగినట్టే, నేను వారిని క్షమించాను.
అయినా, నా జీవం తోడు, యెహోవా మహిమ భూమంతటిని నింపునట్లు,
నా మహిమను, ఈజిప్టులోను, అరణ్యంలోను నేను చూపిన సూచనలను చూసి నాకు లోబడక, నన్ను పదిసార్లు పరీక్షించిన ఏ ఒకరు,
వారి పూర్వికులకు నేను వాగ్దానంగా ప్రమాణం చేసిన దేశాన్ని వారిలో ఏ ఒక్కరు ఎప్పటికిని చూడరు. నా పట్ల ధిక్కారంగా ప్రవర్తించిన వారెవ్వరూ ఎప్పటికీ చూడరు.
అయితే నా సేవకుడు కాలేబు భిన్నమైన ఆత్మ కలిగి ఉండి నన్ను హృదయమంతటితో వెంబడిస్తున్నందుకు, అతడు వెళ్లిన దేశంలోకి నేను అతన్ని తీసుకువస్తాను, అతని వారసులు దానిని స్వతంత్రించుకుంటారు.
యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు:
“ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను.
కాబట్టి వారికి చెప్పండి, ‘నా జీవం తోడు, మీరు సణుగులను నేను విన్న ప్రకారం నేను మీకు చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు:
ఈ అరణ్యంలో మీ శవాలు రాలిపోతాయి అనగా ఇరవై సంవత్సరాలకు పైబడి జనాభా లెక్కలో నమోదై యుండి, నాకు వ్యతిరేకంగా సణిగిన ప్రతి ఒక్కరు రాలిపోతారు.
నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు.
దోచుకోబడతారని నీవు చెప్పిన నీ పిల్లల విషయానికొస్తే, నీవు తిరస్కరించిన భూమిని అనుభవించడానికి నేను వారిని తీసుకువస్తాను.
నలభై సంవత్సరాల వరకు మీరు దేశాన్ని వేగు చూసిన ప్రతి నలభై రోజులకు ఒక సంవత్సరం, మీ దోషశిక్షను మీరు భరించి నేను మీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు.’
యెహోవానగు నేనే స్వయంగా చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా పోగయిన ఈ దుష్ట సమాజం మొత్తానికి, నేను ఖచ్చితంగా ఇవి చేస్తాను. ఈ అరణ్యంలో వారు అంతరిస్తారు; ఇక్కడ వారు చస్తారు.”
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి బాధ్యులైన వీరు మొత్తబడి, యెహోవా ఎదుట తెగులు ద్వార చనిపోయారు.
మరుసటిరోజు ఉదయాన్నే వారు, “నిజంగా మేము పాపం చేశాము. ఇప్పుడు మేము యెహోవా వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం!” అని అంటూ, కొండసీమ మీదున్న ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు.