God
God ను ప్రస్తావించే వచనాలు
అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.
అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు.
యెహెజ్కేలు నీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందంతా మీరూ చేస్తారు. ఇది జరిగినప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
“మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది.
అప్పుడు నీవు మౌనంగా ఉండకుండా తప్పించుకుని వచ్చిన వానితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు. నేనే యెహోవానని వారు తెలుసుకోవడానికి ఇలా నీవు వారికి ఒక సూచనగా ఉంటావు.”
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
వారితో ఇలా చెప్పు, ‘అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా పరిశుద్ధాలయం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం పాడైపోతున్నప్పుడు, యూదా వారు బందీలుగా వెళ్తున్నప్పుడు మీరు “ఆహా!” అన్నారు.
కాబట్టి నేను మిమ్మల్ని తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. వారు గుడారాలు వేసుకుని మీ మధ్య నివసిస్తారు; వారు మీ పండ్లు తిని మీ పాలు త్రాగుతారు.
రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా మారుస్తాను. అమ్మోనీయుల దేశాన్ని గొర్రె దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీరు చప్పట్లు కొట్టి కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు దేశానికి జరిగిన దానిని గురించి మీ మనస్సులోని దురుద్దేశంతో సంతోషించారు.
అందుకే నేను మీకు విరోధినై మిమ్మల్ని ప్రజలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. ఇతర ప్రజల్లో ఉండకుండా నేను మిమ్మల్ని తుడిచివేస్తాను, దేశాల నుండి నిర్మూలిస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి,
మోయాబుకు ఘనతను తెచ్చే పొలిమేర పట్టణాలైన బేత్-యెషిమోతు బయల్-మెయోను కిర్యతాయిములతో మొదలుపెట్టి సరిహద్దు పట్టణాలన్నిటిని
మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఎదోమీయులు యూదా వారి మీద పగతీర్చుకున్నారు. అలా చేసి వారు దోషులయ్యారు,
కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు.
నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ”
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఫిలిష్తీయులు పగతీర్చుకున్నారు తమ హృదయాల్లో ఉన్న ద్వేషంతో పాత పగలతో యూదాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరేతీయులను తుడిచివేస్తాను. సముద్రతీరాన నివసించే మిగిలిన వారికి కూడా నాశనం చేస్తాను.
నా ఉగ్రతతో వారిని శిక్షించి వారి మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. వారి మీద నేను పగ తీర్చుకున్నప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
పదకొండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:
“మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది.
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.
వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను.