Skip to content
లూకా 22:14-38

లూకా 22:14-38

14
వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు.
15
ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను.
16
ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు.
17
ఆయన గిన్నెను తీసుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి.
18
దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు.
19
ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కోసం ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.
20
అలాగే, భోజనమైన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందించనున్న నా రక్తంలో క్రొత్త నిబంధన.
21
కాని నన్ను అప్పగించబోయే వాని చేయి నాతోకూడ ఈ బల్ల మీద ఉంది.
22
నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు.
23
అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.
24
అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది.
25
యేసు వారితో, “యూదేతరుల రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చేసేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు.
26
కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి దాసునిగా ఉండాలి.
27
అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేదా సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్నవాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.
28
మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు.
29
కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను.
31
“సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.
32
కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీకోసం ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పారు.
33
కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.
34
అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు.
35
ఇంకా ఆయన, “మీకు డబ్బు సంచి, సంచి, చెప్పులు లేకుండ నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా?” అని వారిని అడిగారు. దానికి వారు, “ఏమి తక్కువ కాలేదు” అన్నారు.
36
అందుకు ఆయన వారితో, “అయితే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బు సంచి ఉంటే, దాన్ని తీసుకెళ్లాలి. ఒకవేళ మీ దగ్గర ఖడ్గం లేకపోతే, మీ పైవస్త్రాన్ని అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోవాలి.
37
‘ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది; నా విషయంలో ఇది నెరవేర్చబడాలి. అవును, నా గురించి వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి” అని అన్నారు.
38
శిష్యులు, “ఇదిగో ప్రభువా, ఇక్కడ రెండు ఖడ్గాలు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో, “అవి చాలు!” అని జవాబిచ్చారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options