Skip to content

1 రాజులు13

1
యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.
2
యెహోవా వాక్కు ప్రకారం అతడు బలిపీఠానికి వ్యతిరేకంగా బిగ్గరగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా చెప్పే మాట ఇదే: ‘దావీదు కుటుంబంలో యోషీయా అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు క్షేత్రాల మీద బలులు అర్పించే యాజకులను నీ మీద వధిస్తాడు, మనుష్యుల ఎముకలు నీ మీద కాల్చబడతాయి.’ ”
3
అదే రోజు ఆ దైవజనుడు ఒక సూచన ఇచ్చాడు: “యెహోవా చెప్పిన సూచన ఇదే: బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికి పోతుంది.”
4
రాజైన యరొబాము బేతేలులో ఉన్న బలిపీఠం గురించి దైవజనుడు ప్రకటించిన మాట విని, బలిపీఠం మీద నుండి తన చేయి చాపి, “అతన్ని పట్టుకోండి!” అన్నాడు. అయితే అతడు చాపిన చేయి తిరిగి వెనుకకు తీసుకోలేకుండా అది ఎండిపోయింది.
5
అంతేకాక, యెహోవా వాక్కు ద్వారా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారం బలిపీఠం బద్దలై దానిమీది నుండి బూడిద ఒలికిపోయింది.
6
అప్పుడు రాజు ఆ దైవజనునితో, “నా మీద దయచూపి నా చేయి బాగుపడేలా నా కోసం నీ దేవుడైన యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేయి” అన్నాడు. దైవజనుడు యెహోవాను వేడుకున్నప్పుడు రాజు చేయి పూర్తిగా బాగుపడి ముందులా అయ్యింది.
7
అప్పుడు రాజు దైవజనునితో, “భోజనం చేయడానికి నాతో ఇంటికి రా, నీకు బహుమానం ఇస్తాను” అన్నాడు.
8
అయితే దైవజనుడు రాజుకు జవాబిస్తూ అన్నాడు, “నీ ఆస్తిలో సగం నాకు ఇచ్చినా సరే, నేను నీతో వెళ్లను, నేను ఇక్కడ భోజనం చేయను, నీళ్లు త్రాగను.
9
ఎందుకంటే ‘నీవు భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా నాకు ఆజ్ఞాపించారు.”
10
కాబట్టి అతడు బేతేలుకు వచ్చిన దారిన కాక, మరో దారిన తిరిగి వెళ్లాడు.
11
ఆ కాలంలో బేతేలులో ఒక వృద్ధుడైన ప్రవక్త ఉండేవాడు. అతని కుమారులు వచ్చి ఆ రోజు అక్కడ ఆ దైవజనుడు చేసిందంతా అతనికి చెప్పారు. అతడు రాజుతో ఏమి చెప్పాడో కూడా తమ తండ్రికి చెప్పారు.
12
వారి తండ్రి వారిని, “అతడు ఏ దారిన వెళ్లాడు?” అని అడిగాడు. అతని కుమారులు యూదా నుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారి చూపించారు.
13
కాబట్టి అతడు తన కుమారులతో, “గాడిదకు జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిద మీద జీను వేశారు, అతడు గాడిదను ఎక్కి,
14
ఆ దైవజనుని వెదుకుతూ వెళ్లాడు. అతడు సింధూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూసి ఆ ప్రవక్త, “యూదా నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని అడిగాడు. “నేనే” అని అతడు జవాబిచ్చాడు.
15
కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.
16
అందుకు ఆ దైవజనుడు, “నేను తిరిగి మీతో రాలేను, మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గాని, నీళ్లు గాని పుచ్చుకోలేను.
17
యెహోవా వాక్కు ద్వారా నేను ఇలా ఆదేశించబడ్డాను: ‘నీవు అక్కడ భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, నీవు వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా వాక్కు ద్వారా నేను ఆదేశించబడ్డాను” అన్నాడు.
18
ఆ వృద్ధుడైన ప్రవక్త జవాబిస్తూ, “నీలాగే నేను కూడా ప్రవక్తనే. యెహోవా వాక్కు ద్వారా దేవదూత నాతో, ‘అతడు భోజనం చేసి నీళ్లు త్రాగేలా అతన్ని నీతో పాటు నీ ఇంటికి తీసుకురా’ అన్నాడు” అని చెప్పాడు. (కాని అతడు అబద్ధమాడాడు.)
19
కాబట్టి ఆ దైవజనుడు అతనితో పాటు తిరిగివెళ్లి అతని ఇంట్లో అన్నపానాలు పుచ్చుకున్నాడు.
20
వారు ఇంకా బల్ల దగ్గర కూర్చుని ఉండగానే అతన్ని తీసుకువచ్చిన వృద్ధుడైన ప్రవక్త దగ్గరకు యెహోవా వాక్కు వచ్చింది.
21
యూదా నుండి వచ్చిన దైవజనునితో అతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు యెహోవా మాటను ధిక్కరించావు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించలేదు.
22
నీవు భోజనం గాని నీళ్లు గాని తీసుకోవద్దు అని ఆయన ఏ స్థలాన్ని గురించి ఆజ్ఞాపించారో, ఆ స్థలంలో నీవు భోజనం, నీళ్లు తీసుకున్నావు. కాబట్టి నీ శవం నీ పూర్వికుల సమాధిలో పాతిపెట్టబడదు’ ” అని చెప్పాడు.
23
దైవజనుడు భోజనం చేసి నీళ్లు త్రాగిన తర్వాత, అతన్ని తీసుకువచ్చిన ప్రవక్త అతని కోసం గాడిద మీద జీను వేశాడు.
24
అతడు తన దారిన వెళ్తున్నప్పుడు ఒక సింహం ఎదురై అతన్ని చంపేసింది. అతని శవం త్రోవలోనే పడి ఉంది. దాని ప్రక్కన గాడిద సింహం నిలబడి ఉన్నాయి.
25
బాటసారులు కొందరు శవం దారిలో పడి ఉండడం, శవం దగ్గర సింహం నిలబడి ఉండడం చూసి, వెళ్లి ఆ వృద్ధుడైన ప్రవక్త ఉన్న పట్టణంలో ఆ సంగతి చెప్పారు.
26
ప్రయాణం నుండి అతన్ని వెనుకకు తీసుకువచ్చిన ప్రవక్త దాని గురించి విని, “అతడు యెహోవా మాటను ధిక్కరించిన దైవజనుడు. యెహోవా వాక్కు అతన్ని హెచ్చరించిన ప్రకారం సింహం అతన్ని చీల్చి చంపింది” అని అన్నాడు.
27
ఆ ప్రవక్త తన కుమారులను పిలిచి, “నా కోసం గాడిద మీద జీను వేయండి” అని అన్నాడు, వారు అలాగే చేశారు.
28
అప్పుడు అతడు బయటకు వెళ్లి, దారిలో శవం పడి ఉండడం, శవం దగ్గర గాడిద సింహం నిలబడి ఉండడం చూశాడు. సింహం శవాన్ని తినలేదు, గాడిదను చీల్చివేయలేదు.
29
ఆ ప్రవక్త దైవజనుని శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని, అతని కోసం విలపించడానికి, అతని శవాన్ని పాతిపెట్టడానికి దానిని తన పట్టణానికి తిరిగి తీసుకువచ్చాడు.
30
అతడు తన సమాధిలో ఆ శవాన్ని ఉంచగా వారు, “అయ్యో, సోదరుడా!” అని అంటూ ఏడ్చారు.
31
అతన్ని పాతిపెట్టిన తర్వాత, అతడు తన కుమారులతో, “నేను చనిపోయినప్పుడు ఆ దైవజనుని పాతిపెట్టిన సమాధిలోనే నన్ను పాతిపెట్టండి; నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.
32
ఎందుకంటే, బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణాల్లో ఉన్న ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలన్నింటికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు ప్రకారం అతడు ప్రకటించింది తప్పక జరుగుతుంది.”
33
దీని తర్వాత కూడా యరొబాము తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు, కాని మరోసారి క్షేత్రాలకు అని రకాల ప్రజలను యాజకులుగా నియమించాడు. ఎవరైనా యాజకునిగా ఉండాలనుకుంటే వారిని ఆ క్షేత్రాలకు యాజకులుగా ప్రతిష్ఠించాడు.
34
ఈ పాపం యరొబాము కుటుంబ పతనానికి వారు భూమి మీద ఉండకుండా నాశనమవ్వడానికి కారణమైంది.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options