యెషయా 37:21-38
21
అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నీవు నాకు ప్రార్థన చేసినందుకు,
22
అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: “కన్యయైన సీయోను కుమార్తె నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. యెరూషలేము కుమార్తె నీవు పారిపోతుంటే తల ఊపుతుంది.
23
నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!
24
నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, ‘నాకున్న అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.
25
నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.’
26
“చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను. ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను.
27
వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు.
28
“అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు.
29
నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.
30
“హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు.
31
యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది.
32
యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.
33
“కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.
34
అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
35
“నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను!”
36
అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో 1,85,000 మంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు.
37
అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.
38
ఒక రోజు, అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి, అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు.
Settings