ఆదికాండము 37:12-36
12
యోసేపు అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి షెకెముకు వెళ్లారు.
13
ఒక రోజు ఇశ్రాయేలు యోసేపుతో, “నీ అన్నలు షెకెము దగ్గర మందలను మేపుతున్నారని నీకు తెలుసు కదా. రా, నేను నిన్ను వారి దగ్గరకు పంపుతాను” అని అన్నాడు. “సరే, మంచిది” అని అతడు జవాబిచ్చాడు.
14
కాబట్టి యాకోబు, “వెళ్లు, నీ అన్నలు, అలాగే మందల యోగక్షేమాలు తెలుసుకుని, వచ్చి నాకు చెప్పు” అని యోసేపుతో అన్నాడు. తర్వాత అతడు హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు. యోసేపు షెకెముకు చేరుకున్నప్పుడు,
15
అతడు పొలాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం ఒక మనుష్యుడు చూసి, “నీవు ఏం వెదకుతున్నావు?” అని అడిగాడు.
16
యోసేపు జవాబిస్తూ, “నేను మా అన్నల కోసం వెదకుతున్నాను. వారు తమ మందలను ఎక్కడ మేపుతున్నారో మీరు చెప్పగలరా?” అని అడిగాడు.
17
“వారు ఇక్కడినుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వారు అనుకోవడం నేను విన్నాను” అని ఆ వ్యక్తి అన్నాడు. కాబట్టి యోసేపు తన అన్నలను వెదుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు.
18
అయితే వారు అతన్ని దూరం నుండి చూడగానే, అతడు వారిని చేరకముందే, వారు అతన్ని చంపడానికి కుట్రపన్నారు.
19
“కలలు కనేవాడు వస్తున్నాడు!” అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారు.
20
“రండి, వాన్ని చంపి ఈ బావులలో ఒక దాంట్లో పడవేద్దాం, క్రూరమృగం చంపేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమైపోతాయో చూద్దాం” అని అనుకున్నారు.
21
రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు.
22
రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు.
23
కాబట్టి యోసేపు తన అన్నల దగ్గరకు రాగానే, అతడు వేసుకున్న రంగుల అంగీని చింపేశారు.
24
అతన్ని తీసుకెళ్లి బావిలో పడద్రోసారు. ఆ బావి ఖాళీగా ఉంది; అందులో నీళ్లు లేవు.
25
వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, కళ్ళెత్తి చూశారు, గిలాదు నుండి ఇష్మాయేలీయుల వర్తక బాటసారుల గుంపు ఒకటి రావడం కనిపించింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం మోస్తూ ఉన్నాయి, వారు వాటిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నారు.
26
యూదా తన అన్నలతో, “మన తమ్మున్ని చంపి, అతని రక్తం దాచిపెట్టడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి?
27
రండి, వీడిని మనం ఏమి హాని చేయకుండా, ఇష్మాయేలీయులకు అమ్మివేద్దాం; ఎంతైనా మన తమ్ముడు మన సొంత శరీరం కదా” అని అన్నాడు. అతని అన్నలు అందుకు ఒప్పుకున్నారు.
28
కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు.
29
రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు.
30
అతడు తన తమ్ముళ్ల దగ్గరకు తిరిగివెళ్లి, “ఆ బాలుడు అక్కడ లేడు! నేనిప్పుడు ఎక్కడికి వెళ్లాలి?” అని అన్నాడు.
31
అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు.
32
వారు ఆ రంగుల అంగీని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్లి, “మాకు ఇది దొరికింది. ఇది నీ కుమారుని చొక్కాయో కాదో చూడండి” అని అన్నారు.
33
అతడు దానిని గుర్తుపట్టి, “ఈ చొక్కా నా కుమారునిదే! ఒక క్రూరమృగం అతన్ని మ్రింగివేసింది. ఖచ్చితంగా యోసేపును ముక్కలు చేసి ఉంటుంది” అని అన్నాడు.
34
అప్పుడు యాకోబు తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కుమారుని కోసం ఏడ్చాడు.
35
అతని కుమారులు, కుమార్తెలు అందరు అతని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. అతడు వారితో, “లేదు, నేను సమాధిలో నా కుమారుని కలిసే వరకు నేను దుఃఖిస్తాను” అని అన్నాడు. అలా అతడు తన కుమారుని కోసం ఏడ్చాడు.
36
ఇంతలో మిద్యానీయులు యోసేపును, ఈజిప్టులో ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరుకు అమ్మివేశారు.
Settings