Sin (1) గురించి బైబిల్ వచనాలు: Fruits of
Fruits of గురించి వచనాలు
అప్పుడు వారి ఇద్దరి కళ్లు తెరవబడి తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి, తమ శరీరాలను కప్పుకోడానికి అంజూర ఆకులు అల్లుకొన్నారు.
అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు.
అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు.
అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు.
అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు.
అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు.
అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నీవు చేసిన ఈ పనేంటి?” అని అడిగారు. అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, “సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను” అని చెప్పింది.
అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, “అన్ని రకాల పశువుల్లోను, అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! నీవు బ్రతుకు దినాలన్ని నీ పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు.
నేను నీకు స్త్రీకి మధ్య, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య శత్రుత్వం కలుగజేస్తాను; అతడు నీ తలను చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కాటేస్తావు” అని అన్నారు.
తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”
ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; నీ జీవితకాలమంతా దాని పంట నుండి, కష్టపడి పని చేసి తింటావు.
భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది, నీవు పొలం లోని పంటను తింటావు.
నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు మట్టికి చేరేవరకు, నీ నుదిటి మీద చెమట కార్చి నీ ఆహారాన్ని తింటావు నీవు మట్టివి కాబట్టి తిరిగి మన్నై పోతావు.”
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి.
యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు.
అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు.
కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు.
దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.
అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు.
అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది.
ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు.
నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు.
కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది.
ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.
యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు.