Public Prayer గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“ ‘నా కోసం మట్టితో బలిపీఠం తయారుచేసి దానిపై మీ దహనబలులను, సమాధానబలులను, మీ గొర్రెలను పశువులను అర్పించాలి. నేను ఎక్కడ నా పేరును ఘనపరచబడేలా చేసిన, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు.
యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది!
ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను?
కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.
దావీదు, అక్కడ సమావేశమైన వారందరి ఎదుట యెహోవాను ఇలా స్తుతించాడు: “యెహోవా, మా తండ్రియైన ఇశ్రాయేలు దేవా! యుగయుగాల వరకు మీకు స్తుతి కలుగును గాక.
యెహోవా! మహాత్మ్యం, ప్రభావం, వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి. ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే. యెహోవా రాజ్యం మీదే; మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.
ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి; మీరు సమస్తానికి పాలకులు. అందరిని హెచ్చించి, బలపరచడానికి మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.
మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము.
“అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము.
మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.
యెహోవా, మా దేవా, నీ పరిశుద్ధ నామం కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ సంపదంతా మీ చేతి నుండి వచ్చేదే, దానిలో సమస్తం మీకు చెందినదే.
నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను.
యెహోవా! మా పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఈ ఆశలు, తలంపులు మీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండేలా, వారి హృదయాలు మీ పట్ల నమ్మకంగా ఉండేలా చేయండి.
నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”
అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు;
నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను. అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.
ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు.
అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన హస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:
‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి ఏ రాజును నేను ఎన్నుకోలేదు.
అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.
కాని యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.
అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.
“యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.