Claudius Lysias గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
వారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతా ఆందోళనగా మారిందనే వార్త రోమా ప్రధాన సైన్యాధికారికి చేరింది.
అతడు వెంటనే కొందరు అధికారులను, సైనికులను వెంటపెట్టుకుని ఆ గుంపు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆ ఆందోళనకారులు అధిపతిని అతని సైనికులను చూసి, పౌలును కొట్టడం ఆపివేశారు.
అధిపతి వచ్చి అతన్ని పట్టుకుని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత, “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు.
ఆ గుంపులో కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి కేకలు వేశారు, ఆ గందరగోళం వలన ఆ అధిపతికి నిజం ఏమిటని స్పష్టం కాలేదు, కాబట్టి పౌలును సైనిక కోటలోనికి తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపించాడు.
పౌలు మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు, అతనిపై ప్రజలు చాలా ఎక్కువగా దాడి చేస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొనివెళ్లారు.
అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు.
సైనికులు పౌలును సైనిక కోటలోనికి తీసుకెళ్తున్నప్పుడు, పౌలు ఆ అధిపతిని, “నేను మీతో ఒక విషయం చెప్పడానికి అనుమతి ఉందా?” అని అడిగాడు. అందుకు ఆ అధికారి, “నీకు గ్రీకుభాష తెలుసా?” అన్నాడు.
“ఇంతకుముందు తిరుగుబాటును ఆరంభించి నాలుగు వేలమంది విప్లవకారులను అరణ్యంలోనికి నడిపించిన ఈజిప్టు వాడవు నీవేనా?” అని అడిగాడు.
అందుకు పౌలు, “నేను కిలికియ ప్రాంతంలోని తార్సు పట్టణానికి చెందిన యూదుడను, ఆ గొప్ప పట్టణ పౌరుడిని. అయితే దయచేసి ప్రజలతో నన్ను మాట్లాడ నివ్వండి!” అన్నాడు.
అధిపతి అనుమతితో, పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాడు. వారందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, హెబ్రీ భాషలో వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు.
ఇతడు దైవదూషణ చేస్తున్నాడని కేకలువేస్తూ తమ వస్త్రాలను విసిరివేస్తూ, దుమ్మెత్తి ఆకాశంలోనికి పోస్తున్నప్పుడు,
సైన్యాధిపతి పౌలును సైనిక కోటలోకి తీసుకెళ్లి, ప్రజలు అతని గురించి ఎందుకు అలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టించి, విచారించమని ఆదేశించాడు.
వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు.
అది విన్న ఆ శతాధిపతి, తన అధిపతి దగ్గరకు వెళ్లి అతనితో, “మీరేమి చేస్తున్నారు? ఈ వ్యక్తి రోమీయుడు” అని చెప్పాడు.
ఆ అధిపతి పౌలు దగ్గరకు వెళ్లి, “నీవు రోమీయుడవా?” అని అడిగాడు. “అవును, నేను రోమీయుడనే” అని సమాధానం ఇచ్చాడు.
అప్పుడు ఆ అధిపతి, “నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను” అన్నాడు. దానికి పౌలు, “నేను పుట్టుకతోనే రోమీయుడను” అని సమాధానం చెప్పాడు.
అతన్ని విచారణ చేయబోయేవారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. గొలుసులతో బంధించిన పౌలు రోమీయుడని తెలుసుకొన్న తర్వాత అధిపతి కూడా భయపడ్డాడు.
ఆ అధిపతి పౌలు ఎందుకు యూదులచేత నిందింపబడుతున్నాడో సరిగా తెలుసుకోవాలనుకున్నాడు. మరుసటిరోజు అతన్ని విడిచిపెట్టి, ముఖ్య యాజకులను యూదుల న్యాయసభ సభ్యులందరిని సమావేశమవ్వమని ఆదేశించి పౌలును వారి ముందు నిలబెట్టాడు.
ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు.
ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యమిచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి” అని చెప్పారు.
మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు.
ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు.
వారు ముఖ్య యాజకులు యూదా పెద్దల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాము.
కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు.
అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.