Skip to content
ద్వితీయోపదేశకాండము 10:1-11

ద్వితీయోపదేశకాండము 10:1-11

1
అప్పుడు యెహోవా నాతో అన్నారు, “నీవు మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కి పర్వతమెక్కి నా దగ్గరకు రా. అలాగే ఒక కర్ర మందసాన్ని తయారుచేయు.
2
నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. తర్వాత నీవు వాటిని ఆ మందసంలో ఉంచాలి.”
3
కాబట్టి నేను తుమ్మకర్రతో మందసం చేసి, మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి, నా చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని నేను పైకి వెళ్లాను.
4
సమావేశమైన రోజున, పర్వతం మీద, అగ్ని మధ్యలో నుండి మీకు ప్రకటించిన పది ఆజ్ఞలను మొదట వ్రాసినట్లుగానే, యెహోవా ఆ పలకల మీద వ్రాశారు. యెహోవా వాటిని నాకు ఇచ్చారు.
5
తర్వాత నేను పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచాను. ఇప్పుడవి దానిలో ఉన్నాయి.
6
ఇశ్రాయేలీయులు బెనె యహకాను బావులనుండి మొసేరాకు ప్రయాణించారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు.
7
అక్కడినుండి వారు గుద్గోదకు, తర్వాత నీటిప్రవాహాలు ఉన్న దేశమైన యొత్బాతాకు ప్రయాణించారు.
8
నేటి వరకు చేస్తున్నట్లుగా, యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవ చేయడానికి, ఆయన పేరిట ఆశీర్వచనం పలకడానికి లేవీ గోత్రికులను ఆ సమయంలో యెహోవా ప్రత్యేకించుకున్నారు.
9
అందుకే లేవీయులకు వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని స్వాస్థ్యం గాని లేదు; మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారి స్వాస్థ్యము.
10
మొదట ఉన్నట్లే నేను ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాను, ఈసారి కూడా యెహోవా నా మనవి ఆలకించారు. మిమ్మల్ని నాశనం చేయడం ఆయన చిత్తం కాదు.
11
యెహోవా నాతో అన్నారు, “నీవు లేచి వెళ్లు, వారికి ఇస్తానని వారి పూర్వికులతో నేను ప్రమాణం చేసిన దేశంలోనికి వారు వెళ్లి, దానిని స్వాధీనం చేసుకునేటట్లు నీవు వారిని నడిపించు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options