1 రాజులు 2:25-46
25
కాబట్టి రాజైన సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను ఆదేశించగా అతడు అదోనియాను కొట్టాడు. అతడు చనిపోయాడు.
26
తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారుతో, “అనాతోతులో నీ పొలాలకు తిరిగి వెళ్లు. నీవు మరణానికి పాత్రుడవు కాని నీవు నా తండ్రియైన దావీదు ముందు ప్రభువైన యెహోవా మందసాన్ని మోసి, నా తండ్రికి కలిగిన శ్రమలన్నిటిలో పాలుపంచుకున్నావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చంపను” అన్నాడు.
27
కాబట్టి సొలొమోను అబ్యాతారును యెహోవా యాజకుని పదవి నుండి తొలగించాడు. ఇలా షిలోహులో యెహోవా ఏలీ కుటుంబీకుల గురించి చెప్పిన మాట నెరవేరింది.
28
గతంలో అబ్షాలోముతో కాకపోయినా అదోనియాతో కలిసి కుట్రపన్నిన యోవాబుకు ఈ వార్త చేరగానే అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
29
యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని రాజైన సొలొమోనుకు తెలిసింది. అప్పుడు సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను, “వెళ్లు, అతన్ని చంపు!” అని ఆదేశించాడు.
30
కాబట్టి బెనాయా యెహోవా గుడారంలోకి ప్రవేశించి యోవాబుతో, “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు, “లేదు, నేను ఇక్కడే చస్తాను” అన్నాడు. బెనాయా యోవాబు తనతో చెప్పిన మాటను రాజుకు తెలియజేశాడు.
31
అప్పుడు రాజు బెనాయాతో, “అతడు చెప్పినట్లే కానివ్వు. అతన్ని కొట్టి చంపి పాతిపెట్టు. అలా యోవాబు చిందించిన నిరపరాధ రక్తం గురించి నా మీద నా కుటుంబమంతటి మీద ఆ దోషం ఉండదు.
32
అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.
33
వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు.
34
కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వెళ్లి యోవాబును కొట్టి చంపగా అతడు అరణ్యంలో తన ఇంటి దగ్గర పాతిపెట్టబడ్డాడు.
35
రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.
36
తర్వాత రాజు షిమీని పిలిపించి అతనితో, “నీకోసం యెరూషలేములో ఇల్లు కట్టుకుని అక్కడ నివసించు, ఇంకెక్కడికీ వెళ్లకు.
37
ఏ రోజైతే నీవు వెళ్లి కిద్రోను లోయను దాటుతావో, నీవు ఖచ్చితంగా చస్తావు; నీ ప్రాణానికి నీవే బాధ్యుడవు” అన్నాడు.
38
షిమీ రాజుతో, “మీరు చెప్పింది మంచిది, మీ దాసుడననైన నేను నా ప్రభువైన రాజు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. కాబట్టి షిమీ యెరూషలేములో కొంతకాలం నివసించాడు.
39
అయితే మూడేళ్ళ తర్వాత షిమీ దాసులలో ఇద్దరు పారిపోయి గాతు రాజు, మయకా కుమారుడైన ఆకీషు దగ్గరకు వెళ్లారు. “మీ దాసులు గాతులో ఉన్నారు” అని షిమీకి చెప్పబడింది.
40
వెంటనే షిమీ తన గాడిదకు జీను కట్టుకుని తన దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్లాడు. షిమీ వెళ్లి గాతు నుండి తన దాసులను తీసుకువచ్చాడు.
41
షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,
42
రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.
43
మరి ఎందుకు యెహోవా పేరిట నీవు చేసిన ప్రమాణాన్ని, నేను జారీ చేసిన ఆజ్ఞను పాటించలేదు?” అని అన్నాడు.
44
రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.
45
కాని రాజైన సొలొమోను ఆశీర్వదించబడతాడు, దావీదు సింహాసనం యెహోవా ఎదుట నిరంతరం సుస్థిరంగా ఉంటుంది” అని అన్నాడు.
46
తర్వాత రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయటకు వెళ్లి షిమీని కొట్టాడు. అతడు చనిపోయాడు. రాజ్యం సొలొమోను చేతుల్లో సుస్థిరమైంది.
Settings