1 రాజులు 2:28-35
28
గతంలో అబ్షాలోముతో కాకపోయినా అదోనియాతో కలిసి కుట్రపన్నిన యోవాబుకు ఈ వార్త చేరగానే అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
29
యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని రాజైన సొలొమోనుకు తెలిసింది. అప్పుడు సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను, “వెళ్లు, అతన్ని చంపు!” అని ఆదేశించాడు.
30
కాబట్టి బెనాయా యెహోవా గుడారంలోకి ప్రవేశించి యోవాబుతో, “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు, “లేదు, నేను ఇక్కడే చస్తాను” అన్నాడు. బెనాయా యోవాబు తనతో చెప్పిన మాటను రాజుకు తెలియజేశాడు.
31
అప్పుడు రాజు బెనాయాతో, “అతడు చెప్పినట్లే కానివ్వు. అతన్ని కొట్టి చంపి పాతిపెట్టు. అలా యోవాబు చిందించిన నిరపరాధ రక్తం గురించి నా మీద నా కుటుంబమంతటి మీద ఆ దోషం ఉండదు.
32
అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.
33
వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు.
34
కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వెళ్లి యోవాబును కొట్టి చంపగా అతడు అరణ్యంలో తన ఇంటి దగ్గర పాతిపెట్టబడ్డాడు.
35
రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.
Settings