లూకా 21:7-27
7
అందుకు వారు, “బోధకుడా, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరడానికి ముందు సూచనలు ఏమైనా కనబడతాయా? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు.
8
అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు.
9
మీరు యుద్ధాల గురించి, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడవద్దు. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం అప్పుడే రాదు.”
10
తర్వాత ఆయన వారితో: “జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి.
11
అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. ఆకాశంలో కూడ భయంకరమైన సంఘటనలు, గొప్ప సూచనలు కనిపిస్తాయి.
12
“ఇవన్నీ జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకుని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామాన్ని బట్టి మీరు రాజుల ఎదుటకు అధికారుల ఎదుటకు కొనిపోబడతారు.
13
మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు.
14
అయితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ముందుగానే చింతించకుండ ఉండేలా మీ మనస్సును సిద్ధపరచుకోండి.
15
ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.
16
మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు.
17
నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు.
18
కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు.
19
స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు.
20
“యెరూషలేము పట్టణాన్ని సైన్యాలు చుట్టుముట్టాయని మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపించిందని మీరు తెలుసుకోండి.
21
అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు వెళ్లిపోవాలి, బయట పొలాల్లో ఉన్నవారు పట్టణంలోనికి వెళ్లకూడదు.
22
ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం దండన నెరవేరే సమయం ఇదే!
23
ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు పాలిచ్చే తల్లులకు శ్రమ! ఈ ప్రజల మీద దేవుని కోపం దిగి భూమి మీద బహు భయంకరమైన దురవస్థ కలుగుతుంది.
24
ఆ సమయంలో వారు ఖడ్గంచే హతం అవుతారు ఖైదీలుగా అన్ని రాజ్యాలకు అప్పగించబడతారు. యూదేతరుల పరిపాలన కాలం అంతా పూర్తయ్యే వరకు యూదేతరులు యెరూషలేము పట్టణాన్ని అణగద్రొక్కుతారు.
25
“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.
26
ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి కాబట్టి భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో వణికిపోతారు.
27
అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు.
Settings