Skip to content
నిర్గమకాండము 33:1-17

నిర్గమకాండము 33:1-17

1
అప్పుడు యెహోవా మోషేతో, “ఈ స్థలాన్ని విడిచి, నీవు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన ప్రజలు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు, ‘నేను దాన్ని మీ వారసులకు ఇస్తాను’ అని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లండి.
2
నేను నా దూతను మీకు ముందుగా పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్లగొడతాను.
3
పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లండి. అయితే మీరు లోబడని ప్రజలు కాబట్టి నేను మీతో రాను, ఎందుకంటే మార్గం మధ్యలో నేను మిమ్మల్ని అంతం చేస్తానేమో” అన్నారు.
4
ప్రజలు ఈ బాధ కలిగించే మాటలు విన్నప్పుడు, వారు దుఃఖించడం మొదలుపెట్టారు, ఎవరూ ఆభరణాలు ధరించలేదు.
5
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు లోబడని ప్రజలు. ఒకవేళ నేను ఒక్క క్షణం మీతో కలిసి వెళ్లినా, మిమ్మల్ని అంతం చేయవచ్చు. కాబట్టి మీ ఆభరణాలను తీసివేయండి మిమ్మల్ని ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను.’ ”
6
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం దగ్గర నుండి తమ ఆభరణాలను ధరించలేదు.
7
మోషే గుడారం తీసుకుని శిబిరం బయట కొంత దూరంలో దానిని వేసి, దానికి “సమావేశ గుడారం” అని పేరు పెట్టాడు. యెహోవా దగ్గర విచారణ చేసే ప్రతి ఒక్కరు శిబిరం బయట ఉన్న సమావేశ గుడారానికి వెళ్లేవారు.
8
మోషే గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, ప్రజలంతా వారి గుడారపు ద్వారాల దగ్గర నిలబడి, మోషే ఆ గుడారం లోపలికి వెళ్లేవరకు కనిపెట్టుకుని ఉండేవారు.
9
మోషే ఆ గుడారం లోపలికి వెళ్లగానే, మేఘస్తంభం దిగివచ్చి దాని ద్వారం దగ్గర నిలబడేది, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవారు.
10
ఆ గుడారపు ద్వారం దగ్గర మేఘస్తంభం నిలబడడం ప్రజలు చూసినప్పుడెల్లా, వారంతా లేచి నిలబడి, ప్రతిఒక్కరు తమ గుడారపు ద్వారం దగ్గర యెహోవాను ఆరాధించేవారు.
11
ఒకరు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవారు. తర్వాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు, కాని అతని సేవకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యువకుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టేవాడు కాదు.
12
మోషే యెహోవాతో, “ ‘ఈ ప్రజలను నడిపించు’ అని మీరు నాకు చెప్తున్నారు, కాని నాతో ఎవరిని పంపుతారో నాకు చెప్పలేదు. ‘నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు, నీవు నా దయను పొందావు’ అని మీరు అన్నారు.
13
ఒకవేళ మీకు నా మీద దయ ఉంటే, నేను మిమ్మల్ని తెలుసుకొని మీ దయ పొందుతూ ఉండేలా మీ మార్గాలను నాకు బోధించండి. ఈ జనులు మీ ప్రజలేనని జ్ఞాపకముంచుకోండి” అని అన్నాడు.
14
అందుకు యెహోవా, “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి ఇస్తాను” అన్నారు.
15
అప్పుడు మోషే ఆయనతో, “మీ సన్నిధి మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడినుండి పంపవద్దు.
16
మీరు మాతో రాకపోతే నా పట్ల మీ ప్రజల పట్ల మీరు కనికరం చూపించారని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఈ భూమి మీద ఉన్న ఇతర ప్రజల నుండి నన్ను, మీ ప్రజలను ఏది ప్రత్యేకపరుస్తుంది?” అని అడిగాడు.
17
అందుకు యెహోవా మోషేతో, “నీవడిగినట్టే నేను చేస్తాను, ఎందుకంటే నీ మీద నాకు దయ కలిగింది, నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు” అని అన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options