Skip to content
2 దినవృత్తాంతములు 18:12-27

2 దినవృత్తాంతములు 18:12-27

12
మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.
13
అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
14
అతడు వచ్చినప్పుడు, రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, వెళ్లొద్దా?” అని అడిగాడు. అందుకతడు, “దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే వారు మీ చేతికి అప్పగించబడతారు” అని జవాబిచ్చాడు.
15
రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.
16
అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.
17
ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.
18
మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను.
19
అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.
20
చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు. “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.
21
“ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు, వెళ్లు అలాగే చేయి’ అన్నారు.
22
“కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”
23
అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు.
24
మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
25
అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి,
26
వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.
27
మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options