Skip to content
1 రాజులు 15:16-34

1 రాజులు 15:16-34

16
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
17
ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
18
అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో మిగిలిన వెండి బంగారాలంతా తీసి తన అధికారులకు అప్పగించి, దమస్కులో పరిపాలిస్తున్న తబ్రిమ్మోను కుమారుడు, హెజ్యోను మనుమడు, సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.
19
అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
20
రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.
21
బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.
22
అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.
23
ఆసా పరిపాలన గురించిన ఇతర విషయాలు అతని విజయాలు అతడు చేసిందంతా అతడు కట్టించిన పట్టణాల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అతని వృద్ధాప్యంలో అతని పాదాలకు వ్యాధి సోకింది.
24
తర్వాత ఆసా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన పితరుడైన దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు.
25
యూదా దేశంలో రాజైన ఆసా పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలును పరిపాలించాడు.
26
అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతని తండ్రి మార్గాలను అనుసరిస్తూ, అతని తండ్రి ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.
27
నాదాబు మీద ఇశ్శాఖారు గోత్రికుడు, అహీయా కుమారుడైన బాషా కుట్రపన్ని, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తున్న సమయంలో గిబ్బెతోనులో బయెషా నాదాబును చంపేశాడు.
28
యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బయెషా నాదాబును చంపి, అతని తర్వాత రాజయ్యాడు.
29
అతడు రాజైన వెంటనే యరొబాము వంశం వారినందరిని చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఏ ఒక్కని కూడా వదిలిపెట్టకుండా వారందరిని నిర్మూలం చేశాడు. యెహోవా తన సేవకుడు, షిలోహు వాడైన అహీయా ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం ఇది జరిగింది.
30
యరొబాము పాపం చేసి ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకుడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు కాబట్టి ఇలా జరిగింది.
31
నాదాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
32
ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
33
యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.
34
అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ, యరొబాము ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options