Tsallake zuwa abun ciki

గలతీయులకు3

అనుభవానికి విజ్ఞప్తి: విశ్వాసమా క్రియలా

1
అవివేకులైన గలతీయులారా! మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టారు? యేసు క్రీస్తు మీ కళ్లముందే సిలువ వేయబడినంత స్పష్టంగా వివరించాము.
2
ఒక్క విషయాన్ని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను: మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?
3
మీరు ఇంత అవివేకులా? ఆత్మతో ప్రారంభించి, ఇప్పుడు శరీరంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా?
4
మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా?
5
నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్భుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?

విశ్వాసం ద్వారా అబ్రాహాము నీతిమంతుడుగా తీర్చబడుట

6
అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.”
7
కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు.
8
దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది.
9
అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.
10
ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని పాటించనివారు శాపగ్రస్తులు.”
11
ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”
12
ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధించింది కాదు పైగా “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని అది చెప్తుంది.
13
ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యారు. ఎలాగంటే, లేఖనాల్లో, “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే” అని వ్రాయబడిన దాని ప్రకారం.
14
విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకునేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా వర్తించాలని ఆయన మనల్ని విమోచించారు.

ధర్మశాస్త్రము వాగ్దానాన్ని రద్దు చేయలేదు

15
సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యులు చేసిన ఒడంబడికే అయినా దాన్ని స్థిరపరచిన తర్వాత దాన్ని ఎవరూ కొట్టివేయలేరు దానికి ఏమి కలపలేరు. ఇది కూడా అంతే.
16
అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “నీ సంతానానికి” అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు.
17
నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు.
18
ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు.

ధర్మశాస్త్రము ఉద్దేశం

19
అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో ఆ సంతానం వచ్చేవరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది.
20
అయినప్పటికీ మధ్యవర్తి ఒక్కరికే కాదు, కానీ దేవుడు ఒక్కడే.
21
అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చి ఉంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది.
22
అయితే యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా కలిగిన వాగ్దానం ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, లేఖనం సమస్తాన్ని అందరిని పాపంలో బంధించింది.
23
ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము.
24
అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది.
25
అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కాబట్టి మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు.

క్రీస్తులో అందరూ ఒక్కటే

26
కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు.
27
క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
28
ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే.
29
మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options