Tax గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి.
యోసేపు ఈజిప్టులో ఆ ఏడు సంవత్సరాల పంటనంతా సేకరించి పట్టణాల్లో నిల్వచేశాడు. ప్రతి పట్టణం చుట్టూ ఉన్న పొలాల్లో సేకరించిన ధాన్యాన్ని ఆ పట్టణాల్లోనే నిల్వచేశాడు.
కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.
తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు:
“నీవు ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించేటప్పుడు, వారు లెక్కించబడుతున్న సమయంలో ప్రతి ఒక్కరు యెహోవాకు తమ జీవితానికి విమోచన క్రయధనం చెల్లించాలి. అలా చేస్తే నీవు వారిని లెక్కించినప్పుడు ఏ తెగులు వారి మీదికి రాదు.
లెక్కించబడినవారిలో చేరే ప్రతి ఒక్కరు పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం అర షెకెల్ ఇవ్వాలి, దాని బరువు ఇరవై గెరాలు ఉంటుంది. ఈ అర షెకెల్ యెహోవాకు కానుక.
ఇరవై సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగి లెక్కించబడేవారిలో చేరే వారు యెహోవాకు కానుక ఇవ్వాలి.
మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి మీరు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతులు అర షెకెల్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవారు అర షెకెల్ కన్నా తక్కువ ఇవ్వకూడదు.
నీవు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ప్రాయశ్చిత్త డబ్బును తీసుకుని సమావేశ గుడారపు సేవ కోసం ఉపయోగించాలి. మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యెహోవా ఎదుట ఇది ఇశ్రాయేలీయులకు జ్ఞాపకంగా ఉంటుంది.”
ఇరవై సంవత్సరాలు, ఆపై వయస్సు కలిగి నమోదు చేసుకున్న వారు అనగా 6,03,550 మంది పురుషులు తలా ఒక బెకా అంటే, అర షెకెల్, పరిశుద్ధాలయ షెకెల్ చొప్పున చెల్లించారు.
సొలొమోనుకు ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద పన్నెండుమంది జిల్లా అధికారులు ఉన్నారు, వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. ఒక్కొక్కరు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహారం సమకూర్చేవారు.
వారి అధికారుల పేర్లు ఇవి: ఎఫ్రాయిం కొండ సీమకు బెన్-హూరు అధికారి;
మాకస్సు, షయల్బీము, బేత్-షెమెషులో, ఎలోన్-బేత్-హనానులకు బెన్-దెకెరు అధికారి;
అరుబ్బోతుకు బెన్-హెసెదు అధికారి (శోకో, హెఫెరు ప్రదేశమంతా ఇతనికి అప్పగించబడ్డాయి);
నఫోత్ దోరుకు బెన్-అబీనాదాబు అధికారి (ఇతడు సొలొమోను కుమార్తెయైన టఫాతును పెళ్ళి చేసుకున్నాడు);
తానాకుకు, మెగిద్దోకు యెజ్రెయేలు దిగువన ఉన్న సారెతాను తర్వాత ఉన్న బేత్-షాను ప్రాంతం అంతా, బేత్-షాను నుండి ఆబేల్-మెహోలా యొక్మీము అవతలి వరకు అహీలూదు కుమారుడైన బయనా అధికారి;
రామోత్ గిలాదుకు బెన్-గెబెరు అధికారి; (ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడైన యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు ప్రాంతం, దాని యొక్క పెద్ద ప్రాకారాలు ఇత్తడి ద్వారబంధాలు కలిగిన అరవై పట్టణాలు అప్పగించబడ్డాయి);
మహనయీముకు ఇద్దో కుమారుడైన అహీనాదాబు అధికారి;
నఫ్తాలికి అహిమయస్సు అధికారి (ఇతడు సొలొమోను యొక్క మరొక కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు);
ఆషేరుకు, బెయాలోతుకు హూషై కుమారుడైన బయనా అధికారి;
ఇశ్శాఖారుకు పరూయహు కుమారుడైన యెహోషాపాతు అధికారి;
బెన్యామీనుకు ఏలా కుమారుడైన షిమీ అధికారి;
గిలాదుకు ఊరి కుమారుడైన గెబెరు అధికారి (అమోరీయుల రాజైన సీహోను దేశం, బాషాను రాజైన ఓగు యొక్క దేశం). ఈ జిల్లా మీద ఇతడు ఒక్కడే అధికారి.
యూదా, ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా ఉండి తిని త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు.
సొలొమోను యూఫ్రటీసు నది నుండి ఫిలిష్తీయ దేశం, ఈజిప్టు సరిహద్దు వరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ దేశ ప్రజలు సొలొమోనుకు పన్ను చెల్లిస్తూ, అతడు బ్రతికి ఉన్నంత కాలం అతనికి సేవ చేస్తూ ఉన్నారు.