Egypt గురించి బైబిల్ వచనాలు: Israel increases and are oppressed
Israel increases and are oppressed గురించి వచనాలు
తమ కుటుంబాలతో యాకోబు వెంట ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు:
రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;
ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;
దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.
యాకోబు సంతతివారందరు డెబ్బైమంది; అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,
అయితే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ఫలించారు; వారు గొప్పగా విస్తరించారు, అభివృద్ధి చెందారు, వారి సంఖ్య అంతకంతకు అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితోనే నిండిపోయింది.
కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.
అతడు తన ప్రజలతో, “చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యలో, బలంలో మనలను అధిగమించారు.
మనం వారితో యుక్తిగా నడుచుకోవాలి, లేకపోతే వారి సంఖ్య ఇంకా అధికమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే వారు మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.
కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.
అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి,
వారి చేత వెట్టిచాకిరి చేయించారు.
మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.