Skip to content
ద్వితీయోపదేశకాండము 3:1-11

ద్వితీయోపదేశకాండము 3:1-11

1
తర్వాత మనం తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము. అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో మనలను ఎదుర్కోడానికి బయలుదేరాడు.
2
యెహోవా నాతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనును పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని అన్నారు.
3
కాబట్టి మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని సైన్యమంతటిని మన చేతికి అప్పగించారు. వారిలో ఎవరిని మిగల్చకుండా అందరిని హతం చేశాము.
4
ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని మనం స్వాధీనం చేసుకున్నాము. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతమంతటిలో ఉన్న అరవై పట్టణాల్లో స్వాధీనం చేసుకోనిది ఒక్కటి కూడా లేదు.
5
ఈ పట్టణాలన్ని ఎత్తైన గోడలు, ద్వారాలు గడియలతో పటిష్టంగా ఉన్నాయి, వీటితో పాటు గోడలులేని అనేక గ్రామాలు కూడా ఉన్నాయి.
6
హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లే ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులు, పిల్లలను పూర్తిగా నాశనం చేశాము.
7
అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.
8
ఆ సమయంలో ఈ ఇద్దరు అమోరీయుల రాజుల నుండి అర్నోను వాగు మొదలుకొని హెర్మోను పర్వతం వరకు యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము.
9
హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు.
10
పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము.
11
రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options