మార్కు16
Listen to this chapter
0:00
0:00
1
సబ్బాతు దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను కొన్నారు.
2
వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారు సమాధి దగ్గరకు వెళ్తూ
3
“సమాధి ద్వారాన్ని మూసిన రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
4
కాని వారు అక్కడ చేరుకుని, ఆ పెద్ద రాయి ప్రక్కకు తొలగిపోయి ఉండడం చూశారు
5
వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకుని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చుని ఉండడం చూసి, చాలా భయపడ్డారు.
6
అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.
7
అయితే వెళ్లి, ఆయన శిష్యులతో, పేతురుతో, ‘ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. ఆయన మీతో చెప్పినట్లే, అక్కడ మీరు ఆయనను చూస్తారు’ ” అని చెప్పండని ఆ స్త్రీలతో చెప్పాడు.
8
ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ సమాధి నుండి పరుగెత్తి వెళ్లిపోయారు. వారు చాలా భయపడ్డారు, కాబట్టి వారు ఎవరితో ఏమి చెప్పలేదు.
9
వారంలో మొదటి రోజైన ఆదివారం తెల్లవారుతుండగా, యేసు ఎవరిలో నుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టారో ఆ మగ్దలేనే మరియకు మొదట కనిపించారు.
10
ఆమె వెళ్లి, ఆయనతో పాటు ఉండినవారై ఆయన కోసం దుఃఖిస్తూ, ఏడుస్తున్నవారికి చెప్పింది.
11
యేసు బ్రతికి ఉన్నాడని, ఆమె ఆయనను చూసిందని వారు విన్నప్పుడు, వారు నమ్మలేదు.
12
ఆ తర్వాత వారిలో ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా యేసు వారికి వేరే రూపంలో కనిపించారు.
13
వారు తిరిగివెళ్లి జరిగిన విషయాన్ని మిగిలిన శిష్యులకు చెప్పారు; కాని వీరి మాటలను కూడా వారు నమ్మలేదు.
14
తర్వాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు యేసు వారికి కనిపించారు. యేసు తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసినవారు వారికి చెప్పినా వారు నమ్మలేదని, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని గద్దించారు.
15
యేసు వారితో, “మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి.
16
నమ్మి, బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్షను అనుభవిస్తారు.
17
నన్ను నమ్మిన వారందరి ద్వారా ఈ సూచకక్రియలు జరుగుతాయి: నా నామంలో దయ్యాలను వెళ్లగొడతారు; క్రొత్త భాషలు మాట్లాడుతారు;
18
తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.
19
ప్రభువైన యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, దేవుని కుడిచేతి వైపున కూర్చున్నారు.
20
ఆ తర్వాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు, ప్రభువు వారితో కూడా ఉండి, అద్భుతాలు సూచనలతో తన మాటలు నిజమని నిరూపించారు.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note