రోమీయులకు 9:14-29
14
అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు!
15
ఎందుకంటే ఆయన మోషేతో, “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను” అని చెప్పారు.
16
కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది.
17
అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.”
18
కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు.
19
మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు,
20
కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”
21
ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?
22
దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి?
23
మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి,
24
అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి?
25
హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, “నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను; నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,”
26
ఇంకా, “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అదే స్థలంలో వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.”
27
ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు.
28
ప్రభువు తాను చెప్పిన మాటను భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.”
29
యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”
Settings