సంఖ్యాకాండము 16:1-40
1
లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి,
2
మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు.
3
వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు.
4
మోషే ఇది విని సాగిలపడ్డాడు.
5
తర్వాత కోరహుతో, అతని సహచరులందరితో ఇలా అన్నాడు: “రేపు ప్రొద్దున యెహోవా తన వారు ఎవరో పవిత్రులెవరో బయలుపరచి తన దగ్గరకు రానిస్తారు. తాను ఎన్నుకున్న మనిషిని ఆయన తన దగ్గరకు రానిస్తారు.
6
కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి
7
రేపు యెహోవా ఎదుట వాటిలో నిప్పు తెచ్చి ధూపం వేయండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటారో అతడు పవిత్రుడు. లేవీయులారా! మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు!”
8
మోషే కోరహుతో మాట్లాడుతూ, “ఇప్పుడు వినండి లేవీయులారా!
9
ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని మిగిలిన ఇశ్రాయేలీయుల సమాజం నుండి వేరుచేసి, యెహోవా గుడారంలో పని చేయడానికి, సమాజం ముందు నిలబడి వారికి సేవ చేయడానికి మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చినందుకు ఇది మీకు సరిపోదా?
10
నిన్ను, నీ తోటి లేవీయులను ఆయన చేర్చుకున్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం కూడా కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
11
యెహోవాకు విరోధంగా నీవు నీ పక్షంవారు గుమికూడారు. మీరు అహరోను మీద సణగడానికి అతనెవరు?”
12
అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము!
13
మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే భూమి నుండి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చారు, అది చాలదా? ఇప్పుడు నీవు మాపై ప్రభువుగా కూడా ఉండాలనుకుంటున్నావు!
14
అంతేకాక, మీరు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురాలేదు లేదా పొలాలు ద్రాక్షతోటల వారసత్వాన్ని మాకు ఇవ్వలేదు. మీరు ఈ మనుష్యులను బానిసలుగా చూడాలనుకుంటున్నారా? మేము రాము!” అని అన్నారు.
15
మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు.
16
మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి.
17
మీలో ప్రతి ఒక్కరు తమ ధూపార్తి చేతపట్టుకుని ధూపం వేయాలి. అన్నీ కలిపి 250 ధూపార్తులు యెహోవా ఎదుట దానిని సమర్పించాలి. నీవు అహరోను కూడా మీ ధూపార్తులు సమర్పించాలి.”
18
కాబట్టి ప్రతి ఒక్కరు తమ ధూపార్తిలో నిప్పువేసి దాని మీద ధూపం వేసి సమావేశ గుడార ద్వారం దగ్గర, మోషే అహరోనులతో నిలిచారు.
19
కోరహు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా తన పక్షం వారినందరిని సమావేశ గుడార ప్రవేశం దగ్గర పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమ సమాజమంతటికి కనిపించింది.
20
యెహోవా మోషే అహరోనులతో అన్నారు,
21
“ఒక్కసారిగా నేను వారిని నాశనం చేయడానికి అనుకూలంగా ఉండేలా మీరు ఈ సమాజం నుండి వేరుగా నిలబడండి.”
22
కానీ మోషే అహరోనులు సాగిలపడి, “ఓ దేవా! సర్వ ప్రాణులకు ఊపిరి ఇచ్చే దేవా, ఒక్క మనిషి పాపం చేస్తే సమాజమంతటి మీద కోప్పడతారా?” అని వేడుకున్నారు.
23
అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పారు.
24
“సమాజంతో చెప్పు, ‘కోరహు, దాతాను, అబీరాముల డేరాల నుండి దూరంగా వెళ్లండి.’ ”
25
మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్లారు.
26
అతడు సమాజాన్ని హెచ్చరించాడు, “ఈ దుష్టుల డేరాల నుండి దూరంగా వెళ్లండి! వారికి చెందిన దేన్ని తాకకండి, లేదా వారి పాపాలన్నిటిని బట్టి మీరు తుడిచివేయబడతారు.”
27
కాబట్టి కోరహు, దాతాను, అబీరాములు డేరాల దగ్గర నుండి వారు కదిలి దూరంగా వెళ్లారు. దాతాను, అబీరాములు వారి భార్యాపిల్లలు చిన్న పిల్లలు తమ డేరాల ద్వారాలలో నిలబడి ఉన్నారు.
28
అప్పుడు మోషే అన్నాడు, “యెహోవా ఇవన్నీ చేయడానికి నన్ను పంపించారని, నా అంతట నేనే ఏమీ చేయలేదని ఇలా మీరు తెలుసుకుంటారు:
29
ఈ మనుష్యులు, సహజ మరణం పొందితే, మనుష్యులు అనుభవించు విధిని వీరు అనుభవిస్తే, అప్పుడు యెహోవా నన్ను పంపలేదు.
30
కానీ ఒకవేళ యెహోవా పూర్తిగా క్రొత్తదాన్ని తెస్తే, భూమి తన నోరు తెరిచి, వారికి సంబంధించిన ప్రతి దానితో పాటు వారిని మ్రింగివేసి, వారు సజీవంగా పాతాళంలోకి వెళ్తే, వీరు యెహోవాతో ధిక్కారంతో వ్యవహరించారని మీకు తెలుస్తుంది.”
31
మోషే ఈ మాటలు చెప్పి ముగించిన వెంటనే వారి పాదాల క్రింద నేల చీలిపోయింది,
32
భూమి నోరు తెరిచి, ఆ మనుష్యులను వారి ఇంటివారిని, కోరహు పక్షంగా ఉన్నవారందరిని, వారి ఆస్తితో సహా మ్రింగివేసింది.
33
వారంతా వారికి చెందిన సమస్తంతో పాటు ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్లారు; భూమి వారిని కప్పేసింది. వారంతా సమాజంలో లేకుండా నాశనమయ్యారు.
34
వారి కేకలు విని చుట్టూరా ఉన్న ఇశ్రాయేలీయులు, “మనలను కూడా భూమి మ్రింగివేస్తుంది!” అని అంటూ అరుస్తూ పారిపోయారు.
35
యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది.
36
యెహోవా మోషేతో అన్నారు,
37
“యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుకు, బూడిదలో నుండి ఆ ధూపార్తులను తీసివేసి నిప్పు కణాలను దూరంగా చెదరగొట్టమని చెప్పు, ఎందుకంటే అవి పవిత్రమైన ధూపార్తులు.
38
పాపం చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారి ధూపార్తులు. వాటిని చెడగొట్టి, రేకులుగా చేసి, వాటిని బలిపీఠం కప్పుగా వాడాలి, అవి యెహోవా ఎదుట సమర్పించబడినవి కాబట్టి పవిత్రమైనవి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తులుగా ఉండును గాక.”
39
కాబట్టి యాజకుడైన ఎలియాజరు కాల్చి చంపబడినవారు తీసుకువచ్చిన ఇత్తడి ధూపార్తులను సేకరించి, బలిపీఠం మీద కప్పి ఉండేలా వాటిని సుత్తెతో కొట్టించాడు,
40
యెహోవా మోషే ద్వారా అతనికి సూచించిన ప్రకారం చేశాడు. అలా ఎందుకు చేయించారంటే, అహరోను వంశస్థుడు తప్ప ఇతరులెవ్వరు యెహోవా ఎదుట ధూపం వేయడానికి రాకూడదని, వస్తే కోరహు అతని అనుచరుల్లా అవుతారని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయడానికి.
Settings