ద్వితీయోపదేశకాండము 32:19-38
19
యెహోవా ఇది చూసి వారిని తృణీకరించారు, ఎందుకంటే ఆయన తన కుమారులు కుమార్తెల వల్ల కోప్పడ్డారు.
20
“నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారి అంతం ఎలా ఉంటుందో చూస్తాను; ఎందుకంటే వారొక దుర్బుద్ధి కలిగిన తరం, నమ్మకద్రోహులైన పిల్లలు.
21
దేవుడు కాని దానితో వారు నాకు రోషం పుట్టించారు, అయోగ్యమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. జనులు కాని వారిని చూసి వారు అసూయపడేలా చేస్తాను; తెలివిలేని జనులను చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
22
ఎందుకంటే నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది, పాతాళం వరకు అది మండుతుంది. అది భూమిని దాని పంటను మ్రింగివేస్తుంది పర్వతాల పునాదులకు నిప్పు పెడుతుంది.
23
“నేను ఆపదలను వారిపై కుప్పగా చేస్తాను, నా బాణాలను వారి మీదికి వేస్తాను.
24
నేను వారి మీదికి తీవ్రమైన కరువును పంపుతాను, తీవ్ర జ్వరం, మరణకరమైన తెగులు వారిని వేధిస్తాయి, నేను అడవి మృగాల కోరలను, దుమ్ములో ప్రాకే ప్రాణుల విషాన్ని నేను వారి మీదికి పంపుతాను.
25
బయట ఖడ్గం వారిని సంతానం లేనివారినిగా చేస్తుంది; వారి ఇళ్ళలో భయం పరిపాలిస్తుంది, యువతీ యువకులు, నశిస్తారు శిశువులు, తల నెరసినవారు నశిస్తారు.
26
నేను వారిని చెదరగొడతాను, మానవ జ్ఞాపకంలో నుండి వారి పేరును తుడిచివేస్తాను.
27
కాని వారి శత్రువులు తప్పుగా అర్థం చేసుకుని, ‘ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలంతోనే గెలిచాం’ అని అంటారేమోనని శత్రువుల దూషణకు భయపడి అలా చేయలేదు.”
28
వారు ఆలోచనలేని జనులు, వారిలో వివేచన లేదు.
29
వారు తెలివైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, వారి అంతం ఏమిటో వివేచిస్తారు!
30
తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?
31
వారి బండ మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, మన శత్రువులు కూడా ఒప్పుకుంటారు.
32
వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుండి వచ్చింది అది గొమొర్రా పొలాల్లో నుండి వచ్చింది. వాటి ద్రాక్షపండ్లు విషంతో నిండి ఉన్నాయి, వాటి గెలలు చేదుగా ఉన్నాయి.
33
వాటి ద్రాక్షరసం సర్ప విషం, నాగుపాముల మరణకరమైన విషము.
34
“వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది, దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?
35
పగ తీర్చుకోవడం నా పని; నేను తిరిగి చెల్లిస్తాను. సరియైన సమయంలో వారి పాదం జారుతుంది; వారి ఆపద్దినం దగ్గరపడింది వారి విధి వేగంగా వారి మీదికి వస్తుంది.”
36
వారి బలం పోయిందని బానిసలు గాని స్వతంత్రులు గాని ఎవరు మిగలలేదని చూసి, యెహోవా తన ప్రజలకు తీర్పు తీరుస్తారు తన సేవకుల మీద జాలి పడతారు.
37
ఆయన ఇలా అంటున్నారు: “వారి దేవుళ్ళు ఎక్కడ, వారు ఆశ్రయంగా ఏర్పరచుకున్న బండ ఎక్కడ,
38
వారి బలుల క్రొవ్వు తిని వారి పానార్పణల ద్రాక్షరసం త్రాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? మీకు సాయం చేయడానికి వారు లేచెదరు గాక! వారు మీకు ఆశ్రయమిచ్చెదరు గాక!
Settings