2 సమూయేలు 24:1-9
1
యెహోవాకు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీద కోపం రాగా ఆయన, “వెళ్లి ఇశ్రాయేలువారి యూదావారి జనాభాను లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.
2
కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.
3
కాని యోవాబు రాజుతో, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అన్నాడు.
4
అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు.
5
యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు.
6
అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.
7
అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.
8
ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు.
9
యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు.
Settings