Skip to content
2 రాజులు 6:8-23

2 రాజులు 6:8-23

8
అరాము రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతడు తన అధికారులతో చర్చించిన తర్వాత, “నేను ఫలాన స్థలాల్లో నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను” అన్నాడు.
9
దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు సందేశం పంపి, “ఫలాన స్థలానికి వెళ్లవద్దు, ఎందుకంటే అక్కడ అరామీయులు తమ బలగాలను ఉంచారు” అని తెలియజేశాడు.
10
కాబట్టి ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఎలీషా పదే పదే రాజును హెచ్చరించగా అతడు అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్త వహించాడు.
11
ఇది అరాము రాజుకు కోపం కలిగించింది. అతడు తన అధికారులను పిలిపించి, “నాకు చెప్పండి! ఎవరు మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఉన్నారు?” అని అడిగాడు.
12
“మాలో ఎవరు లేరు, నా ప్రభువా, కానీ ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా ప్రవక్త మీరు మీ పడకగదిలో మాట్లాడే మాటలను ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు” అని అతని అధికారులలో ఒకడు చెప్పాడు.
13
“వెళ్లండి, అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. అప్పుడు అతన్ని పట్టుకోడానికి నేను మనుష్యులను పంపిస్తాను” అని రాజు ఆదేశించాడు. అతడు దోతానులో ఉన్నాడని వార్త వచ్చింది.
14
అప్పుడు అతడు గుర్రాలను, రథాలను, గొప్ప బలగాన్ని అక్కడికి పంపాడు. వారు రాత్రి వెళ్లి ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు.
15
మరుసటిరోజు దైవజనుని సేవకుడు పెందలకడ లేచి బయటకు వెళ్లినప్పుడు, పట్టణం చుట్టూ గుర్రాలు, రథాలు కలిగిన సైన్యం ఉండడం చూశాడు. “అయ్యో, నా ప్రభువా! మనం ఏం చేద్దాం?” అని ఆ సేవకుడు అడిగాడు.
16
అందుకు ప్రవక్త, “భయపడకు, మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది” అన్నాడు.
17
అప్పుడు ఎలీషా, “యెహోవా, ఇతడు చూచేటట్టు ఇతడి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ సేవకుని కళ్లు తెరిపించగా ఎలీషా చుట్టూరా కొండ మీదంతా నిప్పులాంటి గుర్రాలు, రథాలు అతనికి కనిపించాయి.
18
శత్రువు అతనివైపు వస్తుండగా, ఎలీషా యెహోవాకు ప్రార్థన చేస్తూ, “ఈ ప్రజలకు గుడ్డితనం కలుగజేయండి” అని అన్నాడు. కాబట్టి యెహోవా ఎలీషా అడిగినట్టుగా వారికి గుడ్డితనం కలుగజేశారు.
19
ఎలీషా వారితో, “ఇది దారి కాదు, ఇది పట్టణం కాదు. నా వెంబడి రండి, మీరు వెదికే మనిషి దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను” అని అన్నాడు. అతడు వారిని సమరయకు తీసుకెళ్లాడు.
20
వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఎలీషా, “యెహోవా, వీరు చూచేటట్టు వీరి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వారి కళ్లు తెరవగా తాము సమరయలో ఉన్నట్లు వారు గ్రహించారు.
21
ఇశ్రాయేలు రాజు వారిని చూసి, “వీరిని చంపనా, నా తండ్రి? వీరిని చంపనా?” అని ఎలీషాను అడిగాడు.
22
అందుకు అతడు, “నీవు వారిని చంపకూడదు, నీ ఖడ్గంతో, వింటితో బందీలుగా తెచ్చిన వారిని చంపుతావా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగి తమ యజమాని దగ్గరికి వెళ్లేలా వారికి భోజనం పెట్టి, నీళ్ళు ఇవ్వు” అని చెప్పాడు.
23
కాబట్టి అతడు వారికి గొప్ప విందు చేసి వారు తిని త్రాగిన తర్వాత వారిని పంపించాడు. వారు తమ యజమాని దగ్గరకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత అరామీయుల దోపిడి మూకలు ఇశ్రాయేలు సరిహద్దులను ఆక్రమించడం మానుకొన్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options