Skip to content
2 రాజులు 14:1-14

2 రాజులు 14:1-14

1
ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యూదారాజు యోవాషు కుమారుడైన అమజ్యా పరిపాలన ఆరంభించాడు.
2
అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది.
3
అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు.
4
అయితే క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
5
రాజ్యం తన వశంలో స్థిరమైన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.
6
అయితే అతడు ఆ హంతకుల సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.
7
అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.
8
తర్వాత అమజ్యా ఇశ్రాయేలు రాజూ యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు దగ్గరకు దూతలను పంపి, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని సవాలు చేశాడు.
9
అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది.
10
నీవు ఎదోమును ఓడించి గర్విస్తున్నావు, నీ విజయంతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”
11
అయితే అమజ్యా వినలేదు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా, యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు.
12
ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు.
13
ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు యెరూషలేముకు వచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.
14
అతడు యెహోవా మందిరంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని తీసుకున్నాడు. అతడు బందీలను కూడా తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options