Skip to content
2 దినవృత్తాంతములు 24:1-16

2 దినవృత్తాంతములు 24:1-16

1
యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది.
2
యాజకుడైన యెహోయాదా బ్రతికిన కాలమంతా యోవాషు యెహోవా దృష్టికి సరియైనదే చేశాడు.
3
యెహోయాదా యోవాషుకు ఇద్దరు స్త్రీలతో పెళ్ళి చేశాడు, అతనికి కుమారులు కుమార్తెలు ఉన్నారు.
4
కొంతకాలం తర్వాత యోవాషు యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.
5
అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, “మీ దేవుని మందిరాన్ని మరమ్మత్తు చేయాలి కాబట్టి మీరు యూదా పట్టణాలకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరనుండి ప్రతి సంవత్సరం రావలసిన డబ్బును సేకరించండి. అది వెంటనే చేయండి” అని ఆదేశించాడు. కాని లేవీయులు వెంటనే చేయలేదు.
6
కాబట్టి రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి, “నిబంధన గుడారం కొరకై ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే విధించిన పన్నును యూదా నుండి యెరూషలేము నుండి లేవీయులు వెళ్లి తీసుకురావాలని నీవెందుకు అడగలేదు?” అని అన్నాడు.
7
ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరంలోకి చొరబడి దానిలోని పవిత్ర వస్తువులను కూడా బయలు కోసం ఉపయోగించారు.
8
రాజు ఆజ్ఞ ప్రకారం, ఒక పెట్టెను తయారుచేసి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు.
9
దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఇశ్రాయేలీయులకు విధించిన పన్నును వారు యెహోవాకు తీసుకురావాలని యూదాలో యెరూషలేములో ప్రకటించారు.
10
దానికి అధికారులంతా ప్రజలంతా సంతోషించి, వారి కానుకలు తెచ్చి పెట్టె నిండేవరకు అందులో వేశారు.
11
అప్పుడప్పుడు లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరకు తెచ్చేవారు. పెట్టెలో చాలా డబ్బు కనబడితే రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి, పెట్టె ఖాళీచేసి దాని స్థలంలో దానిని మళ్ళీ ఉంచేవారు. ఇలా వారు ప్రతిదినం చేయడం వలన వారు చాలా డబ్బు పోగుచేశారు.
12
రాజు యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిరంలో అవసరమైన పనులు చేసేవారికి ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి తాపీ మేస్త్రీలను, వడ్లవారిని, మందిరాన్ని మరమ్మత్తు చేయడానికి ఇనుముతో ఇత్తడితో పనిచేసేవారిని జీతానికి తీసుకున్నారు.
13
పనివారు శ్రద్ధగా పని చేస్తుంటే వారి ఆధ్వర్యంలో మరమ్మత్తులు ముందుకు కొనసాగాయి. వారు దేవుని మందిరాన్ని దాని అసలు నమూనా ప్రకారం పునర్నిర్మించి దానిని పటిష్టం చేశారు.
14
పని ముగించిన తర్వాత వారు మిగతా డబ్బును రాజు దగ్గరకు, యెహోయాదా దగ్గరకు తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులు సేవా సంబంధమైన వస్తువులు, దహనబలికి ఉపయోగపడే వస్తువులు, గరిటెలు, వేరువేరు వెండి బంగారు వస్తువులు చేయించారు. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యెహోవా మందిరంలో ప్రతిరోజు దహనబలులు అర్పించబడ్డాయి.
15
యెహోయాదా వయస్సు నిండి ముసలితనంలో చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు నూట ముప్పై సంవత్సరాలు.
16
అతడు ఇశ్రాయేలులో దేవునికి, ఆయన మందిరానికి చేసిన మేలును బట్టి దావీదు పట్టణంలో రాజులతో పాటు పాతిపెట్టబడ్డాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options