యోహాను11
Listen to this chapter
0:00
0:00
1
బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు.
2
అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది.
3
కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు.
4
యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు.
5
యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు.
6
లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు.
7
ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు.
8
అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకుముందే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు.
9
అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు.
10
అతడు రాత్రివేళ నడిస్తే వెలుగు ఉండదు కాబట్టి అతడు తడబడతాడు” అని చెప్పారు.
11
యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. కాబట్టి నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు.
12
అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతే బాగవుతాడు” అన్నారు.
13
యేసు అతని చావు గురించి మాట్లాడారు. కాని వారు సాధారణమైన నిద్ర గురించి అనుకున్నారు.
14
కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
15
అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను. దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు.
16
అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు.
17
యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు.
18
యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
19
చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు.
20
మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
21
మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.
22
ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది.
23
యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు.
24
అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది.
25
యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.
26
బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు.
27
ఆమె, “అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
28
ఆమె ఈ మాట చెప్పిన తర్వాత, ఆమె వెనుకకు తిరిగివెళ్లి ఎవరికి తెలియకుండా తన సహోదరియైన మరియను ప్రక్కకు పిలిచి, “బోధకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని చెప్పింది.
29
మరియ అది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది.
30
అప్పటికి ఇంకా యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు.
31
మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం చూసి ఆమె ఏడ్వడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి ఆమె వెంట వెళ్లారు.
32
మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది.
33
ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ,
34
“మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు. అప్పుడు వారు, “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు.
35
యేసు ఏడ్చారు.
36
అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు.
37
అయితే వారిలో కొందరు, “గ్రుడ్డివాడి కళ్లను తెరిచిన ఈయన, ఇతనికి చావు రాకుండా చేయలేదా పోయాడా?” అన్నారు.
38
యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది.
39
యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు. చనిపోయిన లాజరు సహోదరియైన మార్త, “ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది.
40
అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు.
41
కాబట్టి వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను.
42
నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు. అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు.
43
యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు.
44
చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు.
45
మరియను చూడటానికి వచ్చిన యూదులలో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు.
46
అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు.
47
అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు. “మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్భుత కార్యాలను చేస్తున్నాడు.
48
మనం ఆయనను ఇలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన దేశ ప్రజలను తీసుకుపోతారు” అన్నారు.
49
అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు!
50
ప్రజలందరు నశించిపోకుండా వారి కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు.
51
అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కోసం చనిపోతాడని,
52
ఆ దేశం కోసం మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని పిల్లలందరిని ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు.
53
కాబట్టి ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు.
54
కాబట్టి యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిం అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు.
55
యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు.
56
వారు యేసు కోసం వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావట్లేదేమో!” అని చెప్పుకుంటున్నారు.
57
యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియచేయాలని ముఖ్య యాజకులు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note